ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలైన కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, అలాగే ఒంగోలు ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కురుస్తోంది. కృష్ణా జిల్లాలోని పెడన, మొవ్వ, మోపిదేవి, మచిలీపట్నం పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. రోడ్లు చెరువుల్లా మారి, రవాణా వ్యవస్థ దెబ్బతింది. వర్షపు నీరు వీధుల్లో నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. చాలాచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Breaking News – EPFO : ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.7లక్షల బీమా!
అటు NTR జిల్లాలోని వీరులపాడు, కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లోనూ వర్షం దంచికొడుతోంది. వర్ష తీవ్రతతో విద్యుత్ స్తంభాలు కూలి, అనేక గ్రామాలు చీకట్లో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలు అందించడంలో సిబ్బందికి సైతం సవాళ్లు ఎదురవుతున్నాయి. గుంటూరు జిల్లాలోనూ నీటిమునిగిన రహదారుల కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. పంట పొలాలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

విశాఖ మరియు ఒంగోలు నగరాల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తల్లడిల్లుతున్నారు. అనేక ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో నీరు వీధుల్లో నిలిచిపోయింది. అధికారులు తాత్కాలికంగా మోటర్లను ఏర్పాటు చేసి నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తక్కువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కొనసాగుతుందనే అంచనాలతో విద్యుత్, రవాణా, ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/