हिन्दी | Epaper

Janasena : కాసేపట్లో “జయకేతనం” సభ

sumalatha chinthakayala
Janasena : కాసేపట్లో “జయకేతనం” సభ

Janasena : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం సభకు ఆతిథ్యం ఇస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందినందున ‘జయకేతనం’ పేరుతో సభ నిర్వహిస్తున్నారు. స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు.

image

పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌

వివిధ నియోజకవర్గాల నుంచి జనసైనికులు కార్లు, బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాల్లో తరలివస్తుండటతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఆరు చోట్ల పార్కింగ్‌ ప్రాంగణాలు, నాలుగు చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, ఏడు చోట్ల వైద్యశిబిరాలు, 14 అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. 1,700 మంది పోలీసులకు సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు.

హోలీ రోజున జనసేన ఆవిర్భావ సభ

కాగా, టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉన్నప్పటికీ, జనసేన కూడా సమాన ప్రాధాన్యత కలిగిన పార్టీగా కొనసాగుతోంది. హోలీ రోజున జనసేన ఆవిర్భావ సభ జరపడం ప్రత్యేకమైన చారిత్రక సందర్భంగా నిలిచింది. ప్రజల్లో మార్పు, రాజకీయ శుద్ధి కోసం జనసేన చేపట్టిన ప్రయత్నాలకు ఈ సభ మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, కొత్త ఉత్సాహంతో జనసేన తన రాజకీయ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870