అమరావతి: జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ.. శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఈరోజు సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం..
2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈసారి మాత్రం అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో జనసేన అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేయడానికి ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్ కమిటీ, ఆహ్వాన కమిటీ, డెకరేషన్ కమిటీ.. ఇలా రకరకాలుగా అందరినీ భాగస్వామ్యం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనసైనికులు వచ్చే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
90 నిమిషాలు పవన్ కల్యాణ్ ప్రసంగం
సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్పై ఉంటారు. వాహనాల పార్కింగ్కి ఐదు ప్రాంతాలను ఏర్పాటు చేశారు.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ ప్రసంగం 90 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే ఈ సభ ఉద్దేశం అంటున్నారు పార్టీ నేతలు.