हिन्दी | Epaper

CBN – Lokesh : తండ్రీకొడుకులు ఫెయిల్ – జగన్

Sudheer
CBN – Lokesh : తండ్రీకొడుకులు ఫెయిల్ – జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) ..సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ లు టెన్త్ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శలు చేశారు. విద్యార్థుల మూల్యాంకన ప్రక్రియ సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ప్రతి విద్యార్థి మార్కుల జాబితాపై అనుమానాలు వెల్లడి అవుతున్నాయని జగన్ పేర్కొన్నారు. విద్యార్థులు నమ్మకం కోల్పోవడం విద్యాశాఖకు పెను సమస్యగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది

చంద్ర‌బాబు , విద్యాశాఖ మంత్రి లోకేష్‌ (Lokesh )టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది. 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు.

ప్రశ్నపత్రాలు లీకేజీ

మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబుగారూ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా? అని జగన్ ప్రశ్నించారు.

ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు

రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు అని పేర్కొన్నారు.

Read Also : Chandrababu : తాట తీస్తా.. ఎవరినీ వదిలిపెట్టను – సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870