ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu) వ్యవసాయ రంగ అభివృద్ధిపై మరోసారి దృష్టి సారించారు. మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు. భలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వే (Satellite survey) ఫలితాల ఆధారంగా రైతులకు నూతన మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు.శాటిలైట్ సర్వే ద్వారా పంటల వివరాలను సేకరించాలన్నారు. సర్వే డేటాను క్షేత్రస్థాయి సమాచారంతో సరిపోల్చాలన్నారు. రైతులకు ఏ పంట ఎలా సాగాలో స్పష్టంగా తెలియజేయాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా నిరంతర మార్గదర్శనం అవసరమని చెప్పారు.ల్యాండ్ రీసర్వే తర్వాత రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో పాటు వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని స్పష్టం చేశారు. సాగునీటిని చివరి ఆయకట్టుకు చేరేలా చూడాలని సూచించారు.
ఎఐ ఆధారిత రైతు సహాయం
రైతులకు పంటల ప్రణాళిక, విలువ జోడింపు కోసం ఎఐ చాట్బోట్ వినియోగించాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 47.41 లక్షల రైతులకు ఈకేవైసీ పూర్తయిందని అధికారులు తెలిపారు. అర్హులైన వారికి సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.రసాయనాల వాడకం భూసారం తగ్గిస్తోందని హెచ్చరించారు. ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. జపాన్, తైవాన్ వంటి దేశాలకు ఎగుమతులు సాధ్యం కావాలంటే సర్టిఫికేషన్ అవసరమని చెప్పారు.
మొబైల్ రైతుబజార్లతో నేరుగా అమ్మకాలు
నగరాల్లో మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 30 రోజుల్లో కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సాగుకు ప్రోత్సాహం ఇచ్చి, రాయలసీమలో మైక్రో ఇరిగేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు.సముద్ర మత్స్య సంపద సమాచారం యాప్ ద్వారా అందించాలని తెలిపారు. సీవీడ్ సాగును ప్రోత్సహించడంతో పాటు నాణ్యతకు కట్టుబడి ఉండే రైతులకు సబ్సిడీలు ఇవ్వాలన్నారు. పశుసంపద రంగంలో 15% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కోకో ముంజ్ సంస్థపై ప్రశంసలు
కొబ్బరి ఉత్పత్తుల తయారీ సంస్థ ‘కోకో ముంజ్’పై సీఎం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Read Also : Pawan Kalyan: ఇది వేల కోట్ల కుంభకోణం : పవన్ కల్యాణ్