ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) తెలుగు సినిమా పరిశ్రమతో ప్రభుత్వ సంబంధాలు గత కొంతకాలంగా కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి. పలు సమస్యలు, పాలసీ స్పష్టతల లోపం, టికెట్ ధరలు, పన్నుల వ్యత్యాసాలు వంటి అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ సమస్యలకు త్వరలో ఒక నిర్ణయాత్మక పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి రంగం సిద్ధమవుతోంది.

పవన్ కల్యాణ్ అసంతృప్తి నేపథ్యంగా సమావేశానికి ముహూర్తం
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది గడుస్తున్నా, ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి చర్చ జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా ముఖ్యమంత్రితో అధికారిక సమావేశం జరగకపోవడంపై ఆయన గట్టిగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.
15వ తేదీన కీలక భేటీ
ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్మెంట్ కోరారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు.
చర్చించనున్న అంశాలు
ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ జరుగనుంది. ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వంటి కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా, ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.
చాలాకాలంగా టాలీవుడ్కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సత్సంబంధాలకు కొంతకాలంగా అడ్డంకిగా మారిన వివాదాలకు ఈ సమావేశంతో ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ వర్గాలు అనేకసార్లు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
Read also: Vijayawada: సచివాలయం నుంచి పురపాలన కమిషనర్లుగా డిప్యుటేషన్ పై నలుగురు అధికారులు