ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, (Chandrababu Naidu) కేంద్రమంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) తో సీఎం చంద్రబాబు సమావేశం కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖామంత్రి పియూష్ గోయల్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరిపారు. తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర భవిష్యత్ కోసం కేంద్రంతో సమన్వయం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న ఇది తొలి ముఖ్యమైన కేంద్రస్థాయి సంప్రదింపుగా చెప్పవచ్చు.ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రధానంగా రైతుల సంక్షేమం, కర్షకులకు గి ట్టుబాటు ధరలు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం తదితర అంశాలపై కేంద్ర సహకారం అవసరమని స్పష్టంగా వివరించారు.

పొగాకు రైతుల కోసం రూ.300 కోట్ల ప్రణాళిక
పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో నష్టాల బారిన పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకువచ్చింది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 20 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నట్లు ఆయన కేంద్రమంత్రికి వివరించారు. ఈ ప్రక్రియ కోసం బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు పొగాకు కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న ఈ రూ.300 కోట్లలో, టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లను భరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. అంతేకాకుండా, పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి కీలక ప్రక్రియలను టొబాకో బోర్డు ద్వారా సమర్థవంతంగా నియంత్రించేందుకు వీలుగా ప్రస్తుత చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని కూడా ఆయన పీయూష్ గోయల్ను అభ్యర్థించారు.
పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గింపు – ఏపీ రైతులకు నష్టం
పామాయిల్ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ 10 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనను తక్షణమే పునఃపరిశీలించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ లక్ష్యాల సాధనకు కూడా ఈ నిర్ణయం ప్రతికూలంగా పరిణమిస్తుందని సీఎం గుర్తుచేశారు.
ఆక్వా రైతులపై అమెరికా సుంకాల ప్రభావం
ఏపీ ఆక్వా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రంగం. కానీ అమెరికా సీఫుడ్పై విధించిన 27% ఎంటీ-డంపింగ్ డ్యూటీ వల్ల రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆక్వా రైతులు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని సీఎం గోయల్కు వివరించారు. కేంద్రం అమెరికాతో చర్చించి ఈ అధిక సుంకాలను తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు.
మామిడి గుజ్జుపై జీఎస్టీ తగ్గించాలి
మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్) పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి పియూష్ గోయల్ను కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన ఈ సందర్భంగా గోయల్కు తెలియజేశారు. రాష్ట్ర రైతాంగం, పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Read also: Nara Lokesh: జగన్ తన పత్రికలో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు: నారా లోకేశ్