రాష్ట్రంలోని ఉపాధ్యాయ నియామకాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (Mega DSC) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ నియామకాల ప్రక్రియపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన చేసిన మొదటి సంతకం ఈ మెగా డీఎస్సీ ప్రకటనపైనే కావడం విశేషం. దీని ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతుంది.
2025 ఉపాధ్యాయ నియామకాల కోసం జూన్ 2 నుంచి జులై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహించారు. సుమారు నెల రోజులపాటు జరిగిన ఈ పరీక్షల్లో లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం విద్యాశాఖ మెరిట్ జాబితా (Merit List) ను సిద్ధం చేసి విడుదల చేసింది. మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను వివిధ దశల్లో పూర్తిచేసి, తుది జాబితా సిద్ధం చేయడానికి అధికారులు చురుగ్గా పనిచేశారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఈ స్థానాలను భర్తీ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ (Education system) లో పెద్ద ఎత్తున మార్పు రానుంది. ఉపాధ్యాయుల కొరత వల్ల నాణ్యమైన విద్య అందకపోతుందనే విమర్శలకు ఈ నియామకాలు సమాధానం కానున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీరనుంది.
విద్యాశాఖ అధికారులు అన్ని ప్రక్రియలను పూర్తిచేసి (రేపే) సెప్టెంబర్ 15న తుది ఎంపిక జాబితా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్ (Website) లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో వేలాది కుటుంబాలు సంతోషంలో మునిగిపోనున్నాయి. ఉపాధ్యాయులుగా తమ కెరీర్ను ప్రారంభించబోతున్న అభ్యర్థుల కలలు నెరవేరనున్నాయి.

నియామక పత్రాల పంపిణీ
తుది జాబితా విడుదలైన తరువాత సెప్టెంబర్ 19న ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇది కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడం ప్రతి అభ్యర్థికి గర్వకారణం అవుతుంది.మరోవైపు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి అభ్యర్థితోపాటు సహాయకులుగా మరొకరిని వెంటబెట్టుకుని విజయవాడలో వెలగపూడిలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి తీసుకెళ్లేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వీరికి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు భోజనం, నిద్రించడానికి వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి డీఎస్సీకి ఎంపికైన 16 వేల మంది అభ్యర్థులతోపాటు, వారి సహాయకులు మొత్తం 32 వేల మంది హాజరుకానున్నారు. వీరితో పాటు కూటమి పార్టీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదుల తో కలిపి సుమారు లక్ష మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
పాఠశాలలు కేటాయించాలని
ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా 10 రోజులపాటు శిక్షణ ఇస్తారు. అయితే గతంలో డీఎస్సీ అభ్యర్ధులకు కౌన్సెలింగ్ (Counseling) లోనే పాఠశాలలు కేటాయించేవారు. కానీ ఈసారి మాత్రం శిక్షణ అనంతరం పాఠశాలలు కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. దసరా సెలవుల అనంతరం పాఠశాలల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: