हिन्दी | Epaper

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో కీలక మార్పులు

Sharanya
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (Public Distribution System – PDS) పూర్తిగా కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరుల సౌలభ్యం కోసం పలు రంగాలలో విస్తృత సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కీలకమైన నిర్ణయంగా నిలుస్తోంది.

ఇకపై నెలలో 15 రోజులపాటు – రెండు పూటలా పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు- మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నామని తెలిపారు. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులను చేపట్టింది. ఈ నెల నుంచే ఇవి అమలులోకి రానున్నాయి.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు – గత ప్రభుత్వం వైఫల్యాలపై విమర్శ

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పౌరుల అవసరాలను నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపించారు.పేదలకు అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసివేతకు గురయ్యాయని ఆరోపించారు. నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేస్తామని 1,600 కోట్ల రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. ఆయా వాహనాల ద్వారా ఇంటింటికి సరుకులను ఇవ్వడం మానేసి నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడం వల్ల ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

అక్రమ రేషన్ సరుకులపై కఠిన చర్యలు
కార్డుదారులకు అందజేయకుండా మిగిలిపోయిన రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అక్రమంగా తరలిస్తోన్న విషయంపై తమ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని, వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యం

ప్రతి ఒక్కరికీ రేషన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్న పవన్ కల్యాణ్, దివ్యాంగులు, 65 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

Read also: Vallabhaneni Vamsi: వంశీపై కక్షతో కేసులు బనాయిస్తున్నారు: పేర్ని నాని ఆరోపణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870