విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే జాతీయ రహదారిపై ఉదయం భారీ కలకలం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి మండలానికి చెందిన రేగుపాలెం సమీపంలో ప్రమాదవశాత్తూ ఒక భారీ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ట్యాంకర్ నుండి ఒకసారిగా తెల్లగా బయటికి పొంగుతున్న వాయువు కారణంగా స్థానికులు మరియు రహదారి ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు.
ప్రమాద స్థలంలో హుటాహుటిన సహాయక చర్యలు
విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గ్యాస్ లీక్ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యాపిస్తున్న వాయువు కారణంగా దగ్గరలోని పొలాలు, కాలువ ప్రాంతాలు మొత్తం తెల్లగా కమ్ముకుపోయాయి. ఇది చూసిన వారిలో గ్యాస్ విషపూరితమైనదేమో అన్న భయం చోటు చేసుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత లారీ డ్రైవర్ మరియు క్లీనర్ అందించిన సమాచారం ప్రకారం, ట్యాంకర్లో ఉన్న గ్యాస్ “కార్బన్ డయాక్సైడ్ (CO2)” అని, ఇది ప్రధానంగా శీతలపానీయాల పరిశ్రమలో వాడతారని అధికారులు వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో, హైవేపై ట్రాఫిక్కు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. భారీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కొంతసేపటి తరువాత రహదారి పూర్తిగా క్లియర్ చేసి, వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.
Read also: Krishna Mohan Reddy: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును ఖండించిన యాంకర్ శ్యామల