ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మూగజీవాలు, పక్షులపై తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. జామ్నగర్ నుంచి ద్వారకాకు పాదయాత్ర చేస్తున్న సమయంలో తారసపడిన వందలాది కోళ్లను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.శ్రీకృష్ణుడికి భక్తుడైన అనంత్ అంబానీ తన 30వ జన్మదినాన్ని పురస్కరించుకుని ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 140 కిలోమీటర్ల పాదయాత్రను ఐదు రోజుల క్రితం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో అనుకోని సన్నివేశం చోటుచేసుకుంది. కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ను గుర్తించిన అనంత్, ఆ వాహనాన్ని ఆపి, అందులోని కోళ్లకు విముక్తి కల్పించారు. ఈమేరకు యజమానికి డబ్బులు చెల్లించాలని తన బృందానికి తెలిపారు. ఈ క్రమంలోనే తన చేతుల్లో ఓ కోడిని పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నెటిజన్లు సైతం జంతువుల పట్ల ఆయన కు ఉన్న ప్రేమను కొనియాడారు.
పునరావాసం
అనంత్ అంబానీ మార్చి 28న జామ్నగర్లోని మోతీ ఖావ్డీ నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. ఏప్రిల్ 10న ద్వారకా చేరుకుని తన 30వ పుట్టినరోజు వేడుక చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాత్రిపూట ఈ పాదయాత్ర చేస్తున్నారు. జామ్నగర్లో వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని నిర్మించారు.రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో సుమారు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయడం విశేషం. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స చేయడం సహా వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఆలోచన వెనుక అనంత్ అంబానీ ఉన్నారు. ఇది ఆయన ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సహా రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఇది సాకారమైందని వివరించారు.వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. దీంట్లో జంతువులు నివసించేందుకు వీలుగా సహజరీతిలో ఉండేలా వసతి ఏర్పాట్లు చేశారు. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఉండటం విశేషం. ప్రపంచంలోనే ఇది పెద్దది. పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.
సేవ మాత్రమే
అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచే జంతువుల్ని కాపాడటం ఒక అభిరుచిగా ఉండేదని ఆ నిబద్ధతతోనే ఇప్పుడు వంతారా అడవి సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. భారత్లో అంతరిస్తున్న జంతు జాతుల్ని సంరక్షించడమే తమ ఉద్దేశం అని వివరించారు. భారత్ సహా అంతర్జాతీయంగా అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు చాలా మంది ఈ మిషన్లో భాగమయ్యారని అన్నారు అనంత్.రాధా కృష్ణ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా భారతదేశం అంతటా దాదాపు 200కు పైగా ఏనుగుల్ని కాపాడినట్లు అనంత్ అంబానీ అన్నారు. ఏనుగుల్ని కాపాడేందుకే ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ కేవలం సేవ మాత్రమే చేస్తామని ఇది జూ కాదని వివరించారు.’వంతారా అనేది జూ కాదు. ఇది సేవాలయం. గణేశుడు ఏనుగులలో ఉంటాడని,గణేశుడు ఏనుగు రూపమని నేను నమ్ముతాను. అందుకే గణేశుడ్ని పూజించే ఉద్దేశంతోనే ఏనుగులకు సేవ చేస్తాను.’ అని అనంత్ అంబానీ అన్నారు. రాధికా మర్చంట్కు కూడా వంతారా అంటే చాలా ఇష్టమని వీలైనంత ఎక్కువ సమయం అక్కడ గడిపేందుకు ఆసక్తి చూపిస్తుందని చెప్పారు.