టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగంలో కొత్త అడుగులు వేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్) సభలో ఆయన పాల్గొనడం, బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీ దేశం కోసం పనిచేసే ఒకే పార్టీ అని రాయుడు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీపై ఆయనకి ఉన్న అభిమానం తెలిపాయి.
రాయుడు రాజకీయ ప్రయాణం ఇప్పటికే వివిధ మలుపులు తీసుకుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, కొంతకాలానికే ఆ పార్టీని విడిచిపెట్టారు. ఆ తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ, ఆయన రాజకీయంగా స్థిరపడలేకపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలపై వార్తలు వినిపిస్తుండటంతో ఆయన తదుపరి అడుగు ఏంటనే ఉత్కంఠ నెలకొంది.
![ambati rayudubjp](https://vaartha.com/wp-content/uploads/2025/01/ambati-rayudubjp.jpg.webp)
బీజేపీ..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకునేందుకు ట్రై చేస్తుంది. ముఖ్యంగా యువత మరియు క్రీడాకారుల మద్దతు సంపాదించడం కోసం కొత్త నేతలను ఆహ్వానిస్తోంది. అంబటి రాయుడు వంటి క్రికెటర్ చేరిక బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన పేరు, ప్రసిద్ధి వల్ల యువతలో బీజేపీకి చేరువ కావడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అదేవిధంగా, రాయుడు స్వయంగా ఒక క్రీడాకారుడిగా దేశానికి సేవ చేసిన వ్యక్తి కావడం, బీజేపీ దేశభక్తి నినాదాలకు అనుకూలంగా ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీనితోపాటు, ఆయన బీజేపీ నాయకత్వంతో కలిసిపనిచేయగలరా అనే ప్రశ్న కూడా కీలకంగా మారింది.