ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం వైసీపీ కోటరీ వివాదం. వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను జగన్కు దూరమయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఘాటుగా స్పందించారు.
విజయసాయిరెడ్డి ఆరోపణలు
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జగన్ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు పార్టీని పూర్తిగా నియంత్రిస్తున్నారని, వారు తీసుకుంటున్న తప్పు నిర్ణయాల వల్లే వైసీపీ పతనానికి దారితీసిందని పేర్కొన్నారు. జగన్కు నమ్మకస్తులుగా వ్యవహరించే ఈ కోటరీ నేతల వల్లే ప్రజల్లో పార్టీపై విశ్వాసం తగ్గిందని విమర్శించారు. జగన్ ఈ కోటరీని దూరం పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఒకప్పుడు జగన్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఈ విధంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
అమర్ నాథ్ కౌంటర్
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ, “కోటరీని దూరం పెట్టకపోతే జగన్కు భవిష్యత్తు లేదని విజయసాయి అంటున్నారు. అయితే, జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనంటూ ఆయనను ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండని నిలదీశారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?” అని ఆయన సెటైర్లు వేశారు.”ఇంతకాలం పార్టీతో ఉన్నవాళ్లు ఇప్పుడు పార్టీ మారి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? మొన్నటివరకు కోటరీలో భాగంగా ఉన్నవాళ్లు ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం తగినదేనా?” అంటూ ఘాటుగా విమర్శించారు.

గుడివాడ అమర్ నాథ్ మాటల ప్రకారం, విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాని బలాన్ని ఆస్వాదించారని, ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు విమర్శలు చేయడం నీతికి విరుద్ధమని పేర్కొన్నారు.”రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం (టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి), రెండోది వైసీపీ వర్గం, మూడోది ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ల వైపు చూస్తే వర్గం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏ వర్గంలో ఉన్నారో ప్రజలు నిర్ణయించుకోవాలి,” అని అన్నారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్లు ఇప్పుడు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వాళ్లు వెళ్లిపోయేవారా? అని ప్రశ్నించారు. విజయసాయి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా? అని అడిగారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పారు.