అత్యాచార నేర పరిమితులపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనపై హైకోర్టు తీర్పులో వచ్చిన వ్యాఖ్యలు అమానవీయమైనవని సుప్రీం కోర్టు పేర్కొంది.

కేసు నేపథ్యం
2021 నవంబరులో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన, బాలికను బైక్పై ఇంటికి దింపుతామని ఇద్దరు యువకులు తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విని స్థానికులు చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. మార్చి 17న అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
“మహిళల దుస్తులను పట్టుకుని లాగడం, ఛాతి భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదు” అని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తీర్పులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై సామాజిక, రాజకీయ రంగాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
సుప్రీం కోర్టు స్పందన
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. “ఈ తీర్పు అమానవీయమైనది, ఏమాత్రం సున్నితమైనది కాదు” అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
కేంద్ర ప్రభుత్వం & ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇలాంటి తీర్పుల వల్ల సమాజంలో తప్పుదారి పట్టించే సందేశం వెళ్తుంది” అని ఆమె వ్యాఖ్యానించారు. “సుప్రీం కోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలి” అని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాలు & హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లు హైకోర్టు తీర్పును తీవ్రంగా ఖండించాయి.