కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఏఐ సమ్మిట్’ (AI Summit) వేదికగా చోటుచేసుకున్న విచిత్రమైన పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తామని, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్రం ఒకవైపు భారీగా ప్రచారం చేస్తోంది. అయితే, స్వయంగా కేంద్రమే నిర్వహిస్తున్న ఈ ఏఐ సమ్మిట్ ప్రాంగణంలోని ఫుడ్ స్టాల్స్ వద్ద మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ తినుబండారాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వారికి ‘నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్’ (No UPI, No Card.. Only Cash) అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ దిగ్గజాలు హాజరయ్యే ఇలాంటి వేదికపై కనీసం ఒక క్యూఆర్ కోడ్ (QR Code) కూడా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది.
Pratyusha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రత్యూష తల్లి
సాధారణంగా నగరాల్లో ఇప్పుడు టీ కొట్టు నుండి పెద్ద మాల్స్ వరకు అంతా యూపీఐ (UPI) ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ధీమాతోనే సమ్మిట్కు వచ్చిన ప్రతినిధులు, సందర్శకులు తమ జేబులో నగదు లేకుండా కేవలం మొబైల్ ఫోన్లతో వచ్చారు. తీరా ఫుడ్ స్టాల్స్ వద్దకు వెళ్లాక, అక్కడ ఫోన్ పే లేదా గూగుల్ పే పనిచేయదని, కేవలం నగదు మాత్రమే ఇవ్వాలని నిర్వాహకులు తెగేసి చెప్పడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. “భవిష్యత్తు టెక్నాలజీ గురించి ఇక్కడ మాట్లాడుతుంటే, చెల్లింపుల కోసం మాత్రం పాత కాలం నాటి పద్ధతులను అనుసరించడం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ పలువురు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

ఈ పరిణామం డిజిటల్ ఇండియా నినాదానికే విరుద్ధంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం యూపీఐ లావాదేవీల్లో భారత్ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోందని చెబుతుంటే, ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులో సాంకేతిక లోపాలో లేక సమన్వయ లోపమో కానీ డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడం గమనార్హం. టెక్నాలజీ సదస్సులకు వచ్చే వారు సహజంగానే హైటెక్ సౌకర్యాలను ఆశిస్తారని, కనీసం ఇలాంటి చోట్లయినా అన్ని రకాల డిజిటల్ చెల్లింపుల ఆప్షన్లు అందుబాటులో ఉంచాలని సందర్శకులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com