తెలంగాణ రాజకీయ పరిపక్వతకు మరో అధ్యాయం చేరింది. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి మినహా 116 మున్సిపాలిటీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా గ్రామీణపట్టణ స్థానిక స్వపరిపాలన వ్యవస్థకు ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లైతే, ఈ ఎన్నికలు ఆ పునాదిని మరింత బలపరిచే ప్రక్రియగా భావించాలి. మున్సిపాలిటీలలో మొత్తం 2582 వార్డులు ఉండగా అందులో 12 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం గమనార్హం. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడటం పరి పాలనా సాంకేతిక అంశమే అయినప్పటికీ, మిగతా వార్డు లన్నింటిలో పోటీ వాతావరణం నెలకొనడం ప్రజాస్వామ్య ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. అదే విధంగా ఏడు కార్పొరే షన్లలో 414 డివిజన్లు ఉండగా అందులో రెండు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, మిగిలిన 412 డివిజన్లకు ఈ నెల 11న పోలింగ్ జరగడం ప్రజల చైతన్యాన్ని చాటిచెప్పింది. 13వ తేదీన వెలువడిన ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిఫలింపజేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీ కాదని గుర్తించాలి. ఇవి ప్రజల దైనందిన జీవితానికి నేరుగా సంబంధం ఉన్న పాలనా వ్యవస్థను నిర్ణయించే ఎన్నికలు. తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, పట్టణ ప్రణాళి కలు అన్నీ మున్సిపల్ పాలన పరిధిలోకి వస్తాయి. అందు వల్ల ఈఎన్నికల్లో ప్రజలు అభ్యర్థుల వ్యక్తిత్వం, అందుబాటు, సేవాభావం, స్థానిక సమస్యలపై అవగాహన వంటి అంశా లను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 116 మంది మున్సిపల్ చైర్మన్లను, 116 మంది వైస్ చైర్మన్లను ఎన్నుకోవడం జరుగనుంది. అలాగే ఏడు కార్పొరేషన్లకు ఏడుగురు మేయర్లు, ఏడుగురు డిప్యూటీ మేయర్లు ఎన్నికై అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రక్రియతో కొత్త పురపాలక వర్గాలు అధికార బాధ్యతలు స్వీకరించనున్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఉంది.
Read Also : Haryana: అంతు చిక్కని వ్యాధి 15 రోజుల్లో 12 మంది మృతి

ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చినా, స్థానిక పాలనలో ప్రధాన ధ్యేయం రాజకీయ ప్రతిష్ట కాదు ప్రజా సేవ. మున్సిపాలిటీలు, కార్పొ రేషన్లు అభివృద్ధి యంత్రాంగాలుగా మారాలి. పట్టణాల విస్తరణ (Urban development) వేగంగా జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో ప్రణా ళికాబద్ధమైన అభివృద్ధి అత్యవసరం. నియంత్రణలేని నిర్మా ణాలు, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, వర్షాకాలంలో ముంపు సమస్యలు వంటి అంశాలు పట్టణాల(Urban development) ఎదుగుదలకు అడ్డంకు లుగా మారుతున్నాయి. కొత్తగా ఎన్నికైన నాయకత్వం దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగాలి. ప్రత్యేకంగా ఆర్థిక నిర్వహణ కీలకం. స్థానిక సంస్థల ఆదాయ వనరులను పెంచడం, పన్నుల వసూళ్లలో పారదర్శకత, ప్రభుత్వ నిధుల సమర్థ వినియోగం ఇవి అన్నీ సమన్వయంతో నడవాలి. ప్రజలకు సేవలు అందించడంలో సాంకేతికతను వినియోగిం చడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చు. ఆన్లైన్ సేవలు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు, ప్రజలతో ప్రత్యక్ష సంప్రదిం పులు ఇవి ప్రజా విశ్వాసాన్ని పెంచుతాయి. అదేవిధంగా రాజకీయ విభేదాలు పరిపాలనకు అడ్డంకిగా మారకూడదు. మున్సిపల్ కౌన్సిల్లు, కార్పొరేషన్ సభలు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు వేదిక కావాలి. ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి. అధికార పక్షం వాటిని సమగ్రంగా పరిగణించాలి. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకర మైన వాదోపవాదాలు అవసరం కానీ అభివృద్ధి పనులు నిలిచిపోవడం సమంజసం కాదు. మహిళలకు, పేదలకు, అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే విధానాలు స్థానిక సంస్థల ద్వారా అమలవుతాయి. పట్టణ పేదల గృహవసతి, ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం, స్వచ్ఛత కార్యక్రమాలు ఇవి అన్ని కొత్త బోర్డుల కార్యాచరణలో ప్రధాన స్థానాన్ని పొందాలి. పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమైనది. చెట్ల పెంపకం, సరస్సుల సంరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణ వంటి చర్యలు పట్టణాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ఇచ్చిన సందేశం స్పషమైనది. స్థానిక పాలన ప్రభా వవంతంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికైన ప్రతిని ధులు ప్రజల మధ్య ఉండాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తేవాలి. ప్రజలు ఐదేళ్లకు ఒక సారి మాత్రమే కాకుండా ప్రతిరోజు పాలనను మూల్యాంకనం చేస్తారు. మొత్తానికి, 16వ తేదీ ప్రమాణ స్వీకారంతో కొత్త పురపాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఇది కేవలం అధికార స్వీకారంకాదు ప్రజలవిశ్వాసాన్ని నిలబెట్టుకునే సంక ల్పం. ప్రజాస్వామ్య పండుగ విజయవంతంగా ముగిసిన ఈ దశలో, అభివృద్ధియుగానికి శ్రీకారం చుట్టే బాధ్యత ఇప్పుడు ఎన్నికైన నాయకత్వంపై ఉంది. వారు సమగ్ర దృష్టితో, పార దర్శక పరిపాలనతో ముందుకుసాగాలి.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: