భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR-2026) విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖ రెండోసారి వేదిక కావడం విశేషం. 2016 తర్వాత మరోసారి 2026లోనూ విశాఖను ఎంపిక చేయడం ద్వారా నగర ప్రాధాన్యతను నేవీ మరోసారి నిరూపించింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 25 వరకు పది రోజుల పాటు కొనసాగనున్నాయి.
Read Also: PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు పాల్గొంటుండగా, 70కి పైగా అత్యాధునిక యుద్ధనౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ పది రోజుల పాటు నేవీ సిబ్బంది సందడి, యుద్ధనౌకల అలంకరణలతో విశాఖ నగరం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఈసారి ఉత్సవాలు IFRకే పరిమితం కాకుండా మూడు ప్రధాన కార్యక్రమాల సమ్మేళనంగా నిర్వహిస్తున్నారు. IFRతో(IFR2026) పాటు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మిలాన్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్, అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (IONS) సమావేశాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి. దీని ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు, మిత్రదేశాలతో సముద్ర భద్రత, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.
నిన్న సాయంత్రం ‘మిలాన్’ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించి ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలో దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయగా, విదేశీ అతిథులకు ఇది ‘మినీ ఇండియా’గా కనిపిస్తోంది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అత్యంత వైభవంగా నిర్వహించనుండగా, దీనికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సముద్రంలో జరిగే యుద్ధ విన్యాసాలు ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
గతంలో అండమాన్లో పరిమితంగా నిర్వహించిన ‘మిలాన్’ విన్యాసాలను ఈసారి మెరుగైన మౌలిక వసతుల కారణంగా విశాఖకు మార్చడం పర్యాటక రంగానికి కొత్త ఊతం ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపించడమే కాకుండా, వివిధ దేశాల యుద్ధనౌకలు, జలాంతర్గాములను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: