గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరింత వేగం పెంచింది. నగరంలోని ఖరీదైన ప్రాంతమైన కొండాపూర్లో అక్రమంగా ఆక్రమించబడిన ప్రభుత్వ భూమిని తాజాగా హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ సుమారు రూ.700 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడ మార్గంలో ఉన్న జంగమోని కుంటకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జాదారులు మట్టితో పూడ్చేశారు. ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మే ప్రయత్నం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ శాఖ కేసులు నమోదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. కుంట చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూమిని ప్రభుత్వ పరిరక్షణలోకి తీసుకున్నారు.
Read also: Online Gaming Scam: దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల గేమింగ్ కుంభకోణం

Hydra saved lands worth Rs 700 crores
అమీన్పూర్లో పార్కు స్థలం రక్షణ
ఇదే తరహాలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో ఉన్న పార్కు భూమిని కూడా హైడ్రా కాపాడింది. సుమారు 1,253.8 చదరపు గజాల ఈ స్థలం విలువ రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పార్కు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని కాలనీ సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. సర్వే నంబర్ 135లోని ఈ భూమి హుడా లేఅవుట్ అనుమతిలో ప్రజా వినియోగం కోసం కేటాయించబడినదని నిర్ధారించారు. వెంటనే సరిహద్దు రాళ్లు పునఃస్థాపించి, ఫెన్సింగ్తో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అక్రమ కబ్జాలపై కఠిన హెచ్చరిక
చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై అక్రమాలు జరిగితే సహించేది లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. నగరమంతా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. ఎక్కడైనా కబ్జాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలపై సమాచారం ఉంటే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నగర భవిష్యత్తును కాపాడేందుకు ఈ చర్యలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: