తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి సంస్థ వేదికగా కొత్త వివాదం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేసారు. సింగరేణి సంస్థలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని హరీశ్ రావు ఆరోపించారు. సాధారణంగా దేశవ్యాప్తంగా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సగటున రూ. 3 నుండి 3.5 కోట్లు ఖర్చవుతుందని, కానీ సింగరేణి స్వయంగా భూమిని కేటాయించినప్పటికీ, గోల్డ్ పవర్ కంపెనీకి మెగావాట్కు రూ. 5 కోట్ల చొప్పున టెండర్ కట్టబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ఈ లెక్కన 107 మెగావాట్ల ప్రాజెక్టు కోసం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ. 214 కోట్లు అదనంగా చెల్లించారని, ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని ఆయన విమర్శించారు.
Bhatti Vikramarka: తెలంగాణలో రేపటి నుంచి సన్నాహక సమావేశాలు
మరో టెండర్లో కూడా ఇదే తరహా అవకతవకలు జరిగాయని హరీశ్ రావు గణాంకాలను బయటపెట్టారు. 67 మెగావాట్ల సోలార్ పవర్ కోసం ఏకంగా రూ. 480 కోట్లు కేటాయించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ ధర కంటే అధికంగా టెండర్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన సన్నిహితులకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల స్కామ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని, ఈ టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

కేవలం సోలార్ విద్యుత్ మాత్రమే కాకుండా, సింగరేణి గనుల్లో వాడే జిలిటెన్ స్టిక్స్ (పేలుడు పదార్థాలు) కొనుగోలులోనూ అక్రమాలు జరిగాయని హరీశ్ రావు పేర్కొన్నారు. తమ అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం జిలిటెన్ స్టిక్స్ ధరలను ఏకంగా 30 శాతం పెంచారని ఆరోపించారు. ప్రతి రోజూ టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు అవసరమయ్యే సింగరేణిలో, ఈ ధరల పెంపు వల్ల యాజమాన్యంపై కోట్లాది రూపాయల భారం పడుతుందని, ఆ సొమ్ము పాలకుల జేబుల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ వరుస స్కామ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు సింగరేణి భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com