మాజీ మంత్రి కేటీఆర్పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్కు అహంభావం ఎక్కువని, ఆయన మతిస్థిమితం కోల్పోయి అభ్యంతరకర రీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుందని, ఇప్పుడు అధికారం పోయేసరికి తట్టుకోలేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే తాను వయసులో రెండేళ్లు పెద్దవాడినని, 14 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని గుర్తుచేస్తూ.. రాజకీయాల్లో గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని కేటీఆర్కు హితవు పలికారు.
AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడంపై వస్తున్న విమర్శలకు కడియం శ్రీహరి స్పష్టమైన వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి రూ. 1400 కోట్ల నిధులు తీసుకువచ్చానని, ప్రతి గ్రామానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే కేటీఆర్, గతంలో ఇతర పార్టీల నుండి ఎంత మందిని చేర్చుకున్నారో గుర్తుంచుకోవాలని, సిగ్గులేని మాటలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఎవరికీ అధికారం శాశ్వతం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

గ్రామాల్లో బీఆర్ఎస్కు ఉనికి లేకుండా పోయిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక సర్పంచులను గెలుచుకోవడం ద్వారా తమ బలం నిరూపితమైందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. నియోజకవర్గంలో 1,25,000 ఓట్లు సాధించి గతంలో కంటే బలపడ్డామని, తనపై నమ్మకం ఉంచిన ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతి గ్రామానికి రూ. 10 లక్షల అభివృద్ధి నిధులు ఇస్తానని ప్రకటించారు. అవినీతికి తావు లేకుండా సర్పంచులు గ్రామ వికాసానికి తోడ్పడాలని, తన నియోజకవర్గం తనకు దేవాలయం లాంటిదని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com