మహారాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్రావ్ కోకాటె (Manikrao Kokate) ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలు, సాగు సమస్యలపై అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ, మంత్రి మాత్రం తన ఫోన్లో రమ్మీ ఆట ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
‘రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే…’ – రోహిత్ పవార్ ఆవేదన
“రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలపై సభలో చర్చ జరుగుతోంది. కానీ సమాధానం చెప్పాల్సిన మంత్రి మాత్రం మొబైల్లో రమ్మీ ఆడుతున్నారు. ఇది ఎంత నిర్లక్ష్యంగా ఉందో ప్రజలు చూడాలి,” అంటూ రోహిత్ పవార్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో పాటు మంత్రి చేతిలో ఫోన్ పట్టుకుని ఆట ఆడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
విపక్షాల ఆగ్రహం – సమగ్ర విచారణ డిమాండ్
ఈ ఘటనపై మహారాష్ట్రలోని అన్ని ప్రధాన విపక్షాలు మండిపడుతున్నాయి. మాణిక్రావ్ కోకాటె తీరుపై అసెంబ్లీలో సైతం నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతుల సమస్యలపై బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్న మంత్రిగా ఆయన అసభ్య ప్రవర్తనను క్షమించరాని చర్యగా పరిగణిస్తున్నారు. కొంతమంది నేతలు మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read Also : Midhun Reddy Arrest : మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు: జగన్