హైదరాబాద్(Hyderabad) శివార్లలో, సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కంపెనీ(Sigachi) గేటు బయట వాతావరణం హృదయవిదారకంగా ఉంది. ఆ గేటు దగ్గర ఒడిశాకు చెందిన ఒక మహిళ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. తనను లోపలకు పంపించమని పోలీసులను వేడుకుంటున్నారు. ఆమె భర్త ప్రశాంత్ మహాపాత్రో ఆ కంపెనీలోనే పనిచేస్తారు. అక్కడ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె తన భర్త ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరణించిన వారిలో ఆమె భర్త లేరు. ఆస్పత్రిలోనూ కనిపించలేదు. దీంతో కంపెనీలో చిక్కుకుపోయి ఉంటారని భావించిన ఆమె పరుగున వచ్చి, ఫ్యాక్టరీ ముందు పడిగాపులు పడుతున్నారు. భర్త కోసం రోదిస్తూనే ఉన్నారు.
కుప్పకూలిన భవనాలు
పేలుడుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రసాయన పదార్థాల్లో తేమ తొలగించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఆ ప్రక్రియలో గాలి పీడనంలో మార్పుల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం ఎంత పెద్దది అంటే, ఆ ధాటికి రసాయనం శుద్ధి చేసే ప్లాంట్ భవనం కుప్ప కూలింది. దానిపై ఉండే రేకులు గాలిలో ఎగిరి ఫ్యాక్టరీ బయట ఉన్న చెట్లపై పడ్డాయి.
పేలుడు ప్రదేశానికి పక్కన ఉన్న ఇతర భవనాలు దెబ్బతిన్నాయి.

ఘటనాస్థలాన్ని అక్కడ ఆ వ్యర్థాలు తొలగించే కార్యక్రమం సోమవారం రాత్రి వరకు కొనసాగింది. మంగళ వారం కూడా ఆ పని కొనసాగవచ్చు. అనేక బుల్డోజర్లు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులు, వైద్య శాఖ, పోలీసు, రెవెన్యూ, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రతిపక్షం నుంచి హరీశ్ రావు, ఇతర పార్టీల నేతలు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
అయిన వారి కోసం ఆక్రందనలు
క్షతగాత్రులను ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు.
ప్రభుత్వమే వారికి వైద్యం అందిస్తుందని ప్రకటించారు. మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పఠాన్చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం, డీఎన్ఎ పరీక్షలకు ఏర్పాట్లు చేయించారు మంత్రి రాజనరసింహ.
తమను పట్టించుకోవడం లేదు
పేలుడు ధాటికి అక్కడ పనిచేసే వారు ఎగిరి దూరంగా పడ్డారు. అటు కాలిన గాయాల వారు, ఇటు దూరంగా పడడం వల్ల గాయాలయిన వారూ ఉన్నారు. శిథిలాలు తొలగించిన క్రమంలో కొన్ని మృతదేహాలు దొరికాయి. బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం నిండిపోయింది.
తాము ఎంతో దూరం నుంచి వచ్చామని తమను పట్టించుకోవడం లేదని తమకు ఎవరూ సమాధానం చెప్పడం లేదని వారు వాపోయారు.
సోమవారం ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగినప్పటికీ, సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పొగలు కక్కుతూ కనిపించాయి పరిశ్రమలోని కొన్ని ప్రదేశాలు. అక్కడ పెద్ద ఎత్తున ఉన్న ముడి పదార్థాల నుంచి ఆ పొగలు వచ్చాయి. రసాయన పదార్థాలు పెద్ద ఎత్తున ఉండడంతో జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద పెద్ద పైపులు, రేకులు, సిమెంటు శిథిలాలు అన్నీ కలిసిపోయి అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది.
Read Also: Shinawatra: థాయిల్యాండ్ ప్రధాని షినవత్రాపై సస్పెన్షన్