కెనడా(Canada) ప్రభుత్వం విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన శరణార్థులు, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్థిక వలసదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులు, ఫ్రెంచ్(French) మాట్లాడేవారికి దీని వల్ల అధిక ప్రాధాన్యత లభిస్తుంది. తాత్కాలిక వీసాల జారీలో భారతీయు(Indians)లు అధికంగా ఉండటం గమనార్హం. ఈ మార్పుల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.
విదేశాల నుంచి ప్రతిభావంతులు, ఆర్థిక వలసదారుల (economic immigrants) శాశ్వత నివాసానికి సంబంధించి (Permanent Residency) కొత్త విధానాన్ని కెనడా త్వరలోనే అమలు చేయనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎకనామిక్ మొబిలిటీ పాత్వేస్ పైలట్ (EMPP)లో ఈ మేరకు మార్పులు చేపడుతోంది. ఈ కొత్త విధానం ద్వారా నైపుణ్యం కలిగిన శరణార్థులు, విదేశీ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం , ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు.

2018లో ఈఎంపీపీ విధానాన్ని కెనడా ప్రారంభించింది
డిసెంబర్ 31తో ముగియబోతున్న ఈఎంపీపీకి ముందు దీనిని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈఎంపీపీ విధానాన్ని 2018లో కెనడా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా ఈ ఏడాది మార్చి వరకూ సుమారు 970 మంది శరణార్థులు కెనడాలో శాశ్వత నివాసం పొందారు. ఇది శరణార్థులకు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా ఆర్థికంగా దేశానికి తోడ్పాటు అందించేవారిగా వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్. రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) విధానంలో భాగంగా విదేశీ కార్మికులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో పని చేసే వారికి, విద్యార్థులకోసం ఉద్దేశించిన పీజీ వర్క్ పర్మిట్ (PGWP), భాగస్వామి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానంలోనూ మార్పులు చేయనున్నారు. విదేశీ కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థుల జీవిత భాగస్వాములకు కూడా ఇది వర్తిస్తుంది.
భారతీయులే అధికం
కాగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొత్తం 834,010 తాత్కాలిక వీసా దరఖాస్తులను కెనడా ఆమోదించగా.. ఇందులో భారతీయులే అధికం (3,82,055 (45.8%). నూతన శాశ్వత నివాస విధానం, వీసా నిబంధనల్లో మార్పుల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ మార్పులు అనేక కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రాధాన్య జాబితాలో హెల్త్కేర్, టెక్ వర్కర్లకు అవకాశాలు పెరుగుతాయి. తాత్కాలిక వీసా ఆమోదంలో భారతీయులు మొదటి స్థానంలో ఉండటం, వారి వలసదారుల్లో వారి ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడా పర్యటనతో ఇరు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు, వివాదాలకు తెరపడిన సంగతి తెలిసిందే.
Read Also: Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు..సీనియర్ అధికారుల తొలగింపు?