ఆంధ్రప్రదేశ్లో హాస్టల్ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని వసతిగృహాల్లో (హాస్టళ్లలో) ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మరింత సానుకూలంగా స్పందిస్తూ డైట్ ఛార్జీల పెంపుపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేసింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో వెల్లడించారు. తాను డైట్ ఛార్జీ (Diet Charges)ల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు.డైట్ ఛార్జీలు కనుక పెంచితే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు.మంత్రి సవితను తాడేపల్లిలో హాస్టల్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల సంఘం ప్రతినిధులు, ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి పలు సమస్యలు విన్నవించారు.
ఉద్యోగాలతో పాటుగా హాస్టల్స్ అధికారుల పోస్టుల భర్తీ
ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాకాలం కాబట్టి హాస్టల్స్లో ఉండే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులకు వసతి గృహాల్లో తాజాగా ఆహారం, కాచి చల్లార్చిన నీటిని అదించాలని సూచించారు. అంతేకాదు రాష్ట్రంలో నాలుగో తరగతి ఉద్యోగాలతో పాటుగా హాస్టల్స్ అధికారుల పోస్టుల భర్తీ, ప్రమోషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు మంత్రి సవిత (Minister Savita).ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ హాస్టల్స్తో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ వంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు డైట్ ఛార్జీలు అందిస్తుంది. అలాగే విద్యార్థినిలకు కాస్మోటిక్ ఛార్జీలు కూడా చెల్లిస్తారు. ఈ ఛార్జీలను నెలవారీగా వారికి అందజేస్తారు.

పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
ఈ మేరకు 2023-2024కు సంబందించి ఛార్జీలను పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం కూడా డైట్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సవిత ఇప్పటికే ఛార్జీల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలోనే పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల కాస్మోటిక్ ఛార్జీ (Cosmetic charge) లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు డైట్ ఛార్జీల పెంపు వంతు వచ్చింది.మొత్తానికి, డైట్ ఛార్జీల పెంపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించడం, హాస్టల్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతో మందికి ఉపయోగకరంగా మారనుంది.
Read Also: Yerrappa: నకిలీ ఇ స్టాంపు సూత్రధారి ఎర్రప్ప