తెలంగాణలో రైతులకు ఉద్దేశించిన ముఖ్యమైన సంక్షేమ పథకాలలో రైతు భరోసా (Rythu Bharosa) ఒకటి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ (ORR) పరిధిలో ఉన్న సాగుభూములకు కూడా ఈ పథకం కింద నిధులు జమ చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 75,525 మంది రైతుల ఖాతాల్లో రూ. 65.82 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు. సాగు చేస్తున్న రైతులకే ఈ నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
అర్హత లేని భూములకు నిధుల మినహాయింపు
స్కీమ్ అమలులో పారదర్శకత కొనసాగించేందుకు ప్రభుత్వం కొన్ని స్పష్టమైన ప్రమాణాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సాగు లేని భూములు, సాగుకు అనువుకాని భూములు, వెంచర్ ల్యాండ్స్ వంటి భూములను రైతు భరోసా పథకం నుంచి మినహాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా నిధులు నిజమైన అర్హులైన రైతులకే చేరేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు, రైతు సంక్షేమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు భారీగా నిధుల జమ
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు 69.39 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చారు. కేవలం 9 రోజుల్లోనే ప్రభుత్వం మొత్తం రూ. 8,744.13 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇది రైతుల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా, రుణ భారాన్ని తగ్గించడానికీ దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం రైతు భరోసా వంటి పథకాల అమలులో వేగాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.
Read Also : Godavari Pushkaralu 2027 : మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు?