యుద్దం ముగిసిందని ఇరాన్, ఇజ్రాయేల్(Iran-Israel) కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై ఇరాన్ స్పందిస్తూ.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని వెల్లడించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్(Trump) కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరినట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్(Teharn)లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాలను పేలుళ్లు కుదిపేశాయి. ఆ సమయంలో యుద్ధ విమానాలు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య, ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ఏ ఒప్పందం జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది.

ప్రతీకార చర్యలు మరింత ఘాటుగా ఉంటాయి
అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు పంపింది. రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మోహమ్మద్ పాక్పూర్ ఇరాన్ అధికారిక టెలివిజన్లో మాట్లాడుతూ.. ‘‘మూర్ఖుడు, అజ్ఞాని అయిన అమెరికా అధ్యక్షుడికి’ గట్టిగా హెచ్చరిస్తున్నాం. మా పవిత్ర ప్రజాస్వామ్య వ్యవస్థపై తిరిగి దాడి జరిగితే, ప్రతీకార చర్యలు మరింత ఘాటుగా ఉంటాయి.. ఇది ఆయనకు గుణపాఠంగా నిలుస్తుంది’’ అని తెలిపారు. కాగా, ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఈ దాడి తర్వాతే ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని రమత్ గాన్ నగర ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ సూచించింది. రమత్ గాన్పై బాంబుదాడికి ప్రణాళిక వేశామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతకు ముందు ఇజ్రాయేల్.. ఇరాన్లోని ఆరు వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.
కాల్పుల విరమణపై అయోమయం
ట్రంప్ ప్రకటన మేరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశలవారీ కాల్పుల విరమణ జరుగుతుందని, ద్వేషానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి దారితీయనుందని పేర్కొన్నారు. కానీ, ఇరాన్ ఈ ప్రకటనను పూర్తిగా ఖండిస్తూ ఇంకా ఎటువంటి అధికారిక ఒప్పందం లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో, “ఇజ్రాయెల్నే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది, ఇరాన్ కాదు” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం లేదని వెల్లడించింది.
‘‘ప్రస్తుతం ఎటువంటి కాల్పుల విరమణ ఒప్పందం లేదు. కానీ, టెహ్రాన్ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలలోగా ఇజ్రాయెల్ నుంచి అక్రమ దాడులు ఆగితే, తదుపరి ప్రతీకార చర్యలు కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేదు’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాసీ అరగ్చీ అధికార ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Donald Trump : ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన ఇరాన్