బ్రెజిల్లోని శాంటా కేథరినా ప్రాంతంలో ఒక దారుణమైన గగనతల ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల, 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బెలూన్లో పైలట్తో సహా 21 మంది ఉన్నారు. గాల్లోకి ఎగిరిన తర్వాత బెలూన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బెలూన్ కాలిపోతూ కిందపడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 13 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక గవర్నర్ జోర్గిన్హో మెల్లో (Jorginho Mello) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. ఎయిర్ బెలూన్ కాలిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. బ్రెజిల్లో గత ఆదివారం కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఒక మహిళ చనిపోగా 11 మంది గాయపడ్డారు.
కొందరు దూకలేకపోయారు
ఈ ఘటనపై శాంటా కేథరినా మిలిటరీ అగ్నిమాపక శాఖ లెఫ్టినెంట్ కర్నల్ జెవిర్ సిప్రియానో జూనియర్ మాట్లాడుతూ, ప్రమాద సమయంలో పైలట్ అసాధారణ ధైర్యం కనబరిచారని చెప్పారు. బెలూన్ బాస్కెట్లో మంటలు మొదలయ్యాక, బెలూన్ను దిగువకు తీసుకొచ్చాడు.భూమికి చేరువయ్యాక, పర్యాటకులను (Tourists) తక్షణమే బాస్కెట్ నుంచి కిందకు దూకాలని అతడు ఆదేశించాడని తెలిపారు. కొందరు దూకలేకపోయారు. మంటలు తీవ్రమై బెలూన్ పూర్తిగా కూలిపోయిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ 8 మంది మరణించగా, బాస్కెట్ నుంచి దూకిన 13 మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.మరోవైపు, శాంటా కేథరినా హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

లోపల గ్యాస్ లీక్ అయి
పోలీస్ చీఫ్ ఉలిసెస్ గాబ్రియేల్ స్థానిక టీవీతో మాట్లాడుతూ ఈ ప్రమాదం వెనుక వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర వహించాయని తెలిపారు. ‘బెలూన్ ప్రారంభ సమయంలో అది స్థిరంగా లేకపోవడం వల్ల అనేక మంది పర్యాటకులు దాన్ని పట్టుకొని నిలబెట్టాల్సి వచ్చిందని చెప్పారు. బెలూన్ గాలిలోకి ఎగిరిన తర్వాత, వేగంగా వచ్చిన గాలులు దాన్ని తీవ్రంగా అటూ ఇటూ ఊపేయడంతో లోపల గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. ‘బెలూన్ నిర్మాణం ఫ్లేమ్-రిటార్డెంట్ (Flame-retardant) అయినప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించాయని గాబ్రియేల్ వివరించారు. ప్రమాదానికి ప్రతికూల వాతవరణమా లేదా మానవ తప్పిదమా? అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు.
Read Also: America: భారత్ వచ్చే పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ