పంజాబ్ రాష్ట్రం బఠిండాలో విషాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ‘కమల్ కౌర్ బాబీ’ పేరుతో పాపులర్ అయిన పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (వయసు 25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె మృతదేహం బఠిండా జిల్లాలోని ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేయబడ్డ ఓ కారులో గుర్తింపు లభించింది.ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. ముఖ్యంగా గతంలో ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దల్లా నుంచి ఈమె బెదిరింపులు ఎదుర్కోగా తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఉగ్రవాదులే ఏమైనా చేసుంటారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. ఆమె ఎలా చనిపోయింది, ఎక్కడ చనిపోయింది, ఎవరైనా చంపారా అని పరిశీలిస్తున్నారు.
విశేష ప్రాచుర్యం
కమల్ కౌర్ ఇన్స్టాగ్రామ్లో 3.83 లక్షల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. తరచుగా రీల్స్ పోస్ట్ చేస్తూ విశేష ప్రాచుర్యం పొందారు. లుధియానాకు చెందిన ఈమె ఇప్పటి వరకు 1351 పోస్టులు పెట్టారు. అయితే ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా వివిధ సోషల్ మీడియా వేదికల్లోనూ కమల్ కౌర్(Kamal Kaur) చాలా చురుగ్గా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ఈమెకు గ్యాంగ్స్టర్ అర్ష్దల్లా నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కెనడాలో ఉంటున్న అర్ష్దల్లా గతేడాది అక్టోబర్లోనే, కొన్ని రకాల వీడియోలు చేయడం ఆపేయాలని ఈమెకు హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. లేకపోతే ఆమె కుటుంబంలోని ఒకరిని చంపుతానని కూడా బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అనుమానాస్పదంగా
ఈ కేసును హత్యగా భావిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమ్నీత్ కొండల్ తెలిపారు. ఆమె మృతదేహం లభించిన తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ బృందం పోలీసులకు సహాయం అందిస్తుందన్నారు. కమల్ కౌర్ జూన్ 10న తన లుధియానా(Ludhiana)లోని ఇంటి నుండి బఠిండాకు బయలుదేరగా ఆరోజు రాత్రి వరకు ఆమె మొబైల్ ఫోన్ క్రియాశీలంగా ఉందని పోలీసులు గుర్తించారు.

తప్పుడు రిజిస్ట్రేషన్
అలాగే ప్రాథమిక విచారణలో భాగంగా కమల్ కౌర్ను వేరే చోట హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకు వచ్చి మెడికల్ యూనివర్సిటీ వద్ద వదిలేసినట్లు భావిస్తున్నామని అన్నారు.కారు కూడా తప్పుడు రిజిస్ట్రేషన్(Registration) ప్లేట్తో ఉందని బాధిత కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశామన్నారు. పార్కింగ్ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు.
భద్రపరిచినట్లు
అలాగే ప్రస్తుతం ఈమె మృతదేహాన్ని షహీద్ భాయ్ మణిసింగ్(Shaheed Bhai Manisingh) ఆస్పత్రిలో భద్రపరిచినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అన్ని విషయాలు తెలుస్తాయని ఎస్పీ నరీందర్ సింగ్(Narinder Singh) స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనతో పంజాబ్, సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఒక యువ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా దారుణంగా హత్యకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Plane: కుప్పకూలిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం