తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ముందు కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి బయల్దేరిన కేసీఆర్ కాసేపటి క్రితం విచారణ జరిగే బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. కేసీఆర్ వెంట విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎక్స్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు కానున్నారు.
బ్యారేజీల నిర్మాణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై కేసీఆర్ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ఈ న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించి వారి నుంచి అఫిడవిట్లు సేకరించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేసింది. ఈ నెల 6న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావు కూడా కమిషన్ విచారణకు హాజరయ్యారు. తాజాగా కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాగా కమిషన్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ కార్యకర్తలు
ఇకపోతే,బీఆర్కే భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్కే భవన్(BRK Bhavan)కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వేచి ఉన్నారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు. దాదాపు 500 మంది పోలీసులతో బలగాలు మెహరించారు. బీఆర్కే భవన్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.
Read Also: Ponnam Prabhakar: పెంచిన బస్ పాస్ లపై స్పందించిన మంత్రి పొన్నం