తెలంగాణ అటవీ సంరక్షణ చరిత్రలో ఓ కీలక మైలురాయిగా నిలిచింది కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోని ఆదివాసీ గ్రామాల తరలింపు. పెద్దపులుల (టైగర్ల) సంఖ్య పెంచే లక్ష్యంతో 2016లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ఇప్పుడు విజయవంతమైంది.ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదివాసీలను అడవి నుంచి బయటకు పంపించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. ఇలా తరలించిన ఆదివాసీల జీవనోపాధికి వ్యవసాయ భూములను కేటాయిస్తూ వాటికి పట్టాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇలా ప్రయోగాత్మకంగా చేపట్టిన తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో కవ్వాల్ టైగర్ రిజర్వులోనే మరికొన్ని గ్రామాలతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని గ్రామాల తరలింపుపై అటవీశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మైసంపేట, రాంపూర్ సహా పలు గ్రామాలు కవ్వాల్ టైగర్ రిజర్వులోని ప్రధాన ప్రాంతంలో ఉన్నాయి.
పునరావాసం కల్పించాలని
అడవి మధ్యలో జనసంచారం ఉండటంతో పులులు స్థిరపడటం లేదు. ఈ కారణంతోనే గ్రామాలను తరలించి, అక్కడ గడ్డిభూములను అటవీశాఖ అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రెండు గ్రామాల ఆదివాసీలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో పని అంతా సాఫీగా పూర్తి అయింది. ఇప్పుడు ఆ పెద్దపులుల స్థిర నివాసం కోసం మైసంపేట(Maisampeta)లో 50 హెక్టార్లు, రాంపూర్లో 20 హెక్టార్లలో గడ్డిభూములను అభివృద్ధి చేస్తున్నారు.అప్పటి నిర్మల్ జిల్లా 2017లో కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ కవ్వాల్ టైగర్ రిజర్వు కోర్ ఏరియా(Kawal Tiger Reserve Core Area) నుంచి మైసంపేటలోని 105, రాంపూర్లోని 37 ఇలా మొత్తం 142 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని అనుకుంది. ఇందుకు 112 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై(Denotify) చేసింది. తర్వాత పునరావాసంలో భాగంగా ఇళ్లు నిర్మించడమే కాకుండా కమ్యూనిటీ హాల్, ఓవర్హెడ్ ట్యాంక్,రహదారులు, అంగన్వాడీ భవనం, తాగునీరు, విద్యుత్, డ్రైనేజి తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు.

స్ఫూర్తిదాయకంగా
పెద్దపులుల సంరక్షణ కోసం తీసుకున్న ఈ కీలక చర్యను జాతీయ పులుల సంరక్షణ సంస్థ (National Tiger Conservation Authority – NTCA) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేశారు. ఈ ప్రక్రియలో ఆదివాసీలకు రెండు ప్రధాన ఎంపికలు ఇవ్వడం జరిగింది — ఒకటి ఆర్థిక పరిహారం, మరొకటి భూ పరిహారం.వన్యప్రాణుల సంరక్షణ, బయో డైవర్సిటీ పరిరక్షణ కోసం ప్రజల సహకారంతో ప్రభుత్వం చేసిన ఈ తరలింపు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఒకవైపు వన్యప్రాణులకు ఆవాసం కల్పిస్తూ, మరోవైపు ఆదివాసీ ప్రజలకు జీవితంలో నూతన ఆరంభం అందించడం ద్వారా సమతుల్య అభివృద్ధి లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. ఇది దేశవ్యాప్తంగా అడవుల పరిరక్షణలో కొత్త దారిదీపకంగా నిలుస్తుంది.
Read Also: Magam Ranga Reddy : మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి