తెలంగాణలో మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రారంభమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కాసేపే కొనసాగినప్పటికీ, ఆ వెంటనే భానుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలోనే ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో చాలా రోజుల పాటు ఎండలతో పాటు అకాల వర్షాలు కురిశాయి. ఇక చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ రెండో వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు మే 27నే రాష్ట్రాన్ని తాకాయి. రోహిణి కార్తెలో సాధారణంగా బీభత్సమైన ఎండలు ఉంటాయి. కానీ ఈసారి కార్తె మెుదలైన నాటి నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించింది.
వాతావరణ
నైరుతి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఒకటి రెండ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి వాతావరణ పరిస్థితిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

అత్యవసరం
ఈరోజు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల ల్లో వర్షాలు కురిశాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, జనగాం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ జల్లులు కురిశాయి. నేడు కూడా సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.
Read Also: Khammam: ఆన్లైన్లో చెప్పులు ఆర్డర్ చేస్తే చివరికి ఏమొచ్చిందంటే?