రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్(Ukraine)లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

41 ఎయిర్ క్రాఫ్ట్ లను ధ్వంసం చేసిన ఉక్రెయిన్
రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది. తాజాగా భీకరంగా ఎదురుదాడి చేసింది. రష్యాను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. శక్తిమంతమైన డ్రోన్లతో రష్యాకు చెందిన 41 ఎయిర్ క్రాఫ్ట్ లను ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్. అది కూడా ఉక్రెయిన్ సరిహద్దులకు సుదూరంగా అంటే- సరిహద్దుల నుంచి దాదాపుగా 4,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకయా, బెలయా ఎయిర్ బేస్ లను టార్గెట్ గా చేసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఈ దాడిలో రష్యాకు చెందిన నాలుగు ఎయిర్ బేస్ స్టేషన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఎయిర్ క్రాఫ్ట్ లల్లో అణు సామర్థ్యం కలిగిన టీయూ-95, టీయూ-22 వంటి వ్యూహాత్మక బాంబర్లు సైతం ఉండటం రష్యాను తీవ్రంగా ఆందోళన, ఆత్మరక్షణలోకి నెట్టినట్టయింది. ఈ దాడుల కోసం 11 నెలల కిందటే పక్కా ప్రణాళికలను రూపొందించింది ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్.. ఎస్బీయూ.
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
ఈ భీకర దాడి తరువాత రష్యా పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టయింది. దీనితో- సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధపడిందనే వార్తలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. న్యూక్లియర్ యూనిట్ ను అప్రమత్తం చేశారని ఆ దేశ మీడియా వెల్లడించింది. తుది ఆదేశాల కోసం రష్యా ఆర్మీ ఎదురు చూస్తోందని పేర్కొంది. ఈ వార్తలపై క్రెమ్లిన్ స్పందించింది. న్యూక్లియర్ ఆయుధాలను సంధించడానికి వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా లేరని తెలిపింది. కిందటి నెల 4వ తేదీన ఓ ఇంటర్వ్యూలో పుతిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ప్రయోగించదలచుకోలేదని, భవిష్యత్తులో కూడా ఆ అవసరం రాకపోవచ్చని ఆ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. మరోవంక- భారీ మిస్సైళ్లతో కూడిన రష్యన్ మిలటరీ ట్రక్కులు ఉక్రెయిన్ సరిహద్దులకు తరలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి రష్యా పౌరులు ఘనంగా వీడ్కోలు పలకడాన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ పై వారిలో నెలకొన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.