రాష్ట్రంలో కరోనా (Corona) మహమ్మారి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు(Guntur)లోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ కేసులతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10కి చేరింది.
వివరాలు: పల్నాడు, చిలకలూరిపేట, బాపట్లకు చెందిన బాధితులు
కొత్తగా కరోనా బారినపడిన వారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 37 సంవత్సరాల మహిళ, చిలకలూరిపేటకు చెందిన ఓ వృద్ధుడు, బాపట్ల జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళ ఉన్నారు. వీరికి ప్రాధమిక లక్షణాల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, హాస్పిటల్ అవసరం లేకుండా ఇంటి నిర్బంధంలో ఉంచారని పేర్కొన్నారు.
అధికారుల అప్రమత్తత – ప్రజలు జాగ్రత్త వహించాలి
కొత్త కేసుల వెలుగులోకి రావడంతో సంబంధిత జిల్లా వైద్యాధికారులకు నివేదికలు పంపించారని అధికారులు పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు మళ్లీ హితవు చెబుతూ, అవసరమైతేనే బయటకు రావాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్క్ ధరించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : Chandrababu Naidu : టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం