వడగళ్ల వాన కారణంగా దిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఇండిగో విమానం(Indigo Flight) బుధవారం హఠాత్తుగా కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో అల్లకల్లోల్లాన్ని నివారించేందుకు పాకిస్థాన్ గగనతలాన్ని కొంతకాలం ఉపయోగించుకోవడానికి లాహోర్(Lahore) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు ఇండిగో పైలట్(Indigo Pilot). కానీ ఆ అభ్యర్థనను పాక్ తిరస్కరించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.
అసలేం జరిగిందంటే?
దిల్లీ నుంచి శ్రీనగర్కు బుధవారం బయలుదేరిన ఇండిగో 6E2142 విమానంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సహా 220మందికి పైగా ప్రయాణికులున్నారు. మధ్యలో వడగాళ్ల వాన వల్ల ఒక్కసారిగా విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో ప్రయాణికులు భయాందోళ చెందారు. అరుపులు, కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్నారు. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్, శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఆభ్యర్థనను తిరస్కరించిందన పాక్
విమానం అమృత్ సర్ మీదుగా వెళ్తున్నప్పుడు పైలట్ అల్లకల్లోలాన్ని గమనించి పాక్ గగనతలం గుండా వెళ్లడానికి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. కానీ లాహోర్ ఏటీసీ ఆ ఆభ్యర్థనను తిరస్కరించిందన డీజీసీఏ తెలిపింది. దీంతో విమానం తన అసలైన మార్గంలోనే ప్రయాణించాల్సి వచ్చిందని పేర్కొంది.
ఇరుదేశాల గగనతలాలు మూసివేత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. పాక్ విమానాలకు తమ గగనతనంలో అనుమతించనమని ఇండియా సైతం స్పష్టం చేసింది. దీంతో అత్యవసర పరిస్థితిలో కూడా భారత్కు చెందిన ఇండిగో విమానాన్ని పాక్ తమ గగనతలంలోకి అనుమతించలేదు.
సురక్షితంగా ల్యాండ్
“2025 మే 21న దిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్లే 6ఈ 2142 విమానం ఆకస్మిక వడగళ్ల వానను అధిగమించి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులందరినీ పరామర్శించాం. ఎవరికీ గాయాలు అవ్వలేదు. ప్రస్తుతం విమానానికి శ్రీనగర్లో తనిఖీలు, మరమ్మతులు అవుతున్నాయి. అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత మళ్లీ సేవలు ప్రారంభమవుతాయి.” అని ఇండిగో పోస్ట్ చేసింది.
విమానంలో ఉన్నవారు భయంతో కేకలు
దిల్లీ- శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, నదిముల్ హక్, సాగరిక ఘోష్, మానస్ భూనియా, మమతా ఠాకూర్ ఉన్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు చావు అంచుల వరకు వెళ్లామని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ వ్యాఖ్యానించారు. తన జీవితం ముగిసిపోయిందనుకున్నానని పేర్కొన్నారు. విమానంలో ఉన్నవారు భయంతో కేకలు వేస్తూ, ప్రార్థనలు చేశారని చెప్పారు.
Read Also: Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు