హవేరి గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల ఊరేగింపు: న్యాయవ్యవస్థ, సామాజిక విలువలపై పెరుగుతున్న ప్రశ్నలు
కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగిన ఓ అత్యంత దారుణమైన గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు ఇటీవల బెయిల్ లభించడం, అనంతరం వారు నిర్వహించిన భారీ ఊరేగింపు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సుమారు 16 నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురు ప్రధాన నిందితులకు హవేరి సెషన్స్ కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మహమ్మద్ సాదిక్ అగసిమని, షోయబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సవికేరి అనే ఏడుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇటీవల వీరికి బెయిల్ లభించడంతో, హవేరిలోని అక్కి ఆలూర్ పట్టణంలో బైక్లు, కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. నిందితులు నవ్వుతూ, విజయ సంకేతాలు చూపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
కేసు వివరాలు – మతాంతర ప్రేమజంటపై దాడి, అటవీ ప్రాంతంలో అత్యాచారం
2024 జనవరి 8న, హవేరి జిల్లాలోని (Haveri district) ఓ హోటల్ గదిలో మతాంతర ప్రేమజంట కలిసుండగా, కొంతమంది యువకులు అకస్మాత్తుగా ఆ గదిలోకి ప్రవేశించి వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం, మహిళను బలవంతంగా సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనను తొలుత మోరల్ పోలీసింగ్ కేసుగా నమోదు చేశారు. బాధితురాలు, కేఎస్ఆర్టీసీ (KSRTC) డ్రైవర్ అయిన తన భాగస్వామితో కలిసి హోటల్లో ఉండటమే దీనికి కారణం. అయితే, జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గ్యాంగ్ రేప్ సెక్షన్లను చేర్చారు. విచారణ సమయంలో బాధితురాలు నిందితులను గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. ఇది ప్రాసిక్యూషన్ కేసును బలహీనపరిచిందని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 19 మందిని అరెస్ట్ చేయగా, వీరిలో 12 మందికి సుమారు పది నెలల క్రితమే బెయిల్ లభించింది. మిగిలిన ఏడుగురు ప్రధాన నిందితులకు పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు, తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బాధితురాలు నిందితులను గుర్తించలేకపోవడం కేసుకు మలుపు
కోర్టులో విచారణ సమయంలో బాధితురాలు నిందితులను గుర్తించడంలో విఫలమయ్యారు. ఇది ప్రాసిక్యూషన్ పక్షానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. నిందితులపై ఉన్న ఆధారాలు పరిమితంగా ఉండటంతో, వారి నిర్దోషిత్వంపై న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. దీంతో బెయిల్ మంజూరైనట్లు సమాచారం. అయినా, బెయిల్ పొందిన నిందితులు ఈ వ్యవహారాన్ని తమ విజయంగా చూపించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది బాధితురాలిపై మళ్లీ మానసిక ఒత్తిడిని కలిగించే చర్యగా భావిస్తున్నారు.
Read also: Naxal Encounter: ఎన్కౌంటర్ అనంతరం సంబరాలు చేసుకున్న డీఆర్ జీ బలగాలు