తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains), ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను దృష్టిలో పెట్టుకొని విపత్తు సమయంలో తక్షణ స్పందన కోసం ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ స్థాయి విపత్తు బృందాలు సిద్ధంగా
అత్యవసర సహాయ చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ప్రమాదాలకు ముందు జాగ్రత్తగా వీరు ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు సన్నద్ధంగా ఉన్నారు. ఈ బృందాలకు అవసరమైన యంత్రాంగం, రవాణా సదుపాయాలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిమాపక, హైడ్రా బృందాల సిద్ధత
విపత్తు సమయంలో సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అగ్నిమాపక దళాలు, హైడ్రా బృందాలను కూడా సిద్ధం చేశారు. రహదారులపై నీటి నిల్వలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడం వంటి కార్యాచరణల్లో ఈ బృందాలు పాల్గొంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వాతావరణ శాఖ సూచనల మేరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also : Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు CM చంద్రబాబు