రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. అంతేకాదు పది సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇక అతడి జీవితమే నాశనం అయిపోయిందని అంతా అనుకుంటుండగా అతడో మాట చెప్పాడు. అందరి ముందే తాను బాధితురాలిని వివాహం చేసుకుంటానని వివరించాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకోగా న్యాయమూర్తులు సైతం ఇందుకు అంగీకరించారు. ఫలితంగా సుప్రీం కోర్టు గదిలోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిపంచారు. న్యాయమూర్తుల ఎదురుగానే వీరిద్దరూ పూల దండలు మార్చుకున్నారు. దీని తర్వాతే న్యాయమూర్తులు మాట్లాడుతూ నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పి పడ్డ పదేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తున్నట్లు వివరించారు.2016 తన సోదరి స్నేహితురాలికి ఓ యువకుడు మెసేజ్ చేశాడు.ఫేస్బుక్(Facebook) ద్వారా ఆమెతో మాట కలిపాడు. ఆపై నేరుగా కనిపించి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నువ్వంటే ఇష్టమని, లేకపోతే చచ్చిపోతానంటూ వివరించాడు. అవన్నీ నమ్మిన యువతి కూడా అతడి ప్రేమకు ఓకే చెప్పింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు.అంతేకాకుండా,అనేక మార్లు శారీరకంగా కలిశారు. ఎలాగూ పెళ్లి చేసుకునే వాళ్లమే కదా అంటూ పదే పదే ఆమెను వాడుకున్నాడు. కానీ రెండేళ్లు గడవగానే యువతి పెళ్లి చేసుకోమని బలవంత పెట్టగా మా అమ్మ ఒప్పుకోవట్లేదు, నీ దారి నీది, నా దారి నాదంటూ వెల్లడించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని యువతి పోలీసులను ఆశ్రయించింది.

ఇరుపక్షాలు
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబుతూ తనను పదే పదే శారీరకంగా వాడుకున్నాడని వివరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సెషన్స్ కోర్టులో నిందితుడిని హాజరు పరిచారు. 2024 సెప్టెంబర్ 5వ తేదీ అతడిని దోషిగా నిర్దారించింది. పదే పదే అత్యాచారం చేసినందుకు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 376(2)(N) కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేసింది. అలాగే మోసం చేసినందుకు గాను ఐపీసీ సెక్షన్ 417 కింద రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నిందితుడు మద్రాస్ హైకోర్టు(Madras High Court)కు వెళ్లాడు. కానీ ఎలాంటి ఉపయోగమూ లేకపోయింది. దీంతో తాజాగా సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించాడు.ఈ కేసు సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు మొదట ఇరుపక్షాలు, వారి తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి ఛాంబర్లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అలా హాజరు కాగా మీ ఇద్దరికీ పెళ్లి చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అని న్యాయమూర్తులు అడిగారు. అందుకోసం కేసును మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. భోజనానంతరం మళ్లీ పిలవగా నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆమె కూడా అందుకు అంగీకరించడంతో కోర్టు హాల్లోనే అతడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆపై వారిద్దరూ పూల దండలు మార్చుకున్నారు. దాన్ని నిశ్చితార్థంగా పరిగణిస్తూ న్యాయమూర్తులు బి.వి నాగరత్న, సతీష్ చంద్ర శర్మలు నిందితుడికి పడిన పదేళ్ల జైలు శిక్షను నిలిపి వేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా నిందితుడిని వెంటనే సెషన్స్ కోర్టు(Sessions Court)లో హాజరు పరచాలని ఫలితంగా కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుందని చెప్పారు. అలాగే త్వరలోనే వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు వారి తల్లిదండ్రులకు ఏర్పాట్లు చేస్తారని కూడా తాము భావిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: India-China: మిత్రదేశాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహం: రష్యా మంత్రి