కోవిడ్ సమయంలో ఆన్లైన్ తరగతులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతో చాలా మంది పిల్లలు మొబైల్స్కు అలవాటు పడ్డారు. క్రమంగా సెల్ఫోన్ వ్యసనంగా మారడంతో ఎక్కువ మంది చిన్నారుల్లో మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖపట్నంలోని మానసిక ఆసుపత్రికి ఈ తరహా కేసులే ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో పిల్లలు, కౌమార దశలో ఉన్నవారికి చికిత్స చేసేందుకు స్పెషల్ వార్డు అందుబాటులో ఉంది. చిన్నారుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్న క్రమంలో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రత్యేకంగా చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ(Child and Adolescent Psychiatry)విభాగాన్ని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్)లో నిర్వహిస్తున్నారు. ఈ తరహా రెండో విభాగం దేశంలోనే మొత్తంమీద విశాఖపట్నంలోనే ఉంది. ఇక్కడి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రసన్న కుమార్ చొరవతో దీనిని ఏర్పాటు చేశారు. ఏడాదిగా ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. తద్వారా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. మానసిక సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన పిల్లలను లోతుగా పరిశీలిస్తున్నారు.

థెరపిస్ట్
ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. పిల్లల విభాగం ప్రారంభించక ముందు కనీసం నెలకు ముగ్గురు చిన్నారులు కూడా రావడం గగనమే. అందులోనూ సదరం ధ్రువపత్రాల కోసం వచ్చేవారే ఎక్కువ.కొద్దిరోజులుగా మానసిక సమస్యలు, మాటలు రాకపోవడం, ఆటిజం, తెలివితేటలు తక్కువగా ఉన్నాయని పలువురు పిల్లలను తీసుకొస్తున్నారు. చిన్నారుల విభాగంలో వారానికి కనీసం 120 ఓపీ నమోదవుతోంది. ఇన్పేషెంట్లుగా చేరిన వారికి కనీసం మూడు వారాలు చికిత్స అందిస్తున్నారు. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్య అందిస్తున్నారు.ఇన్పేషెంట్స్ కోసం 30 పడకలు అందుబాటులో ఉన్నాయి. అందులో చిన్నారులు, కౌమార దశ వారికి ప్రత్యేకంగా(Specifically) ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలను చేర్చుకోవడానికి నిత్యం 60 నుంచి 70 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.రీహాబిలిటేషన్ సెంటర్లో నిత్యం ముగ్గురు థెరపిస్ట్లు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో చిన్నారికి ప్రతి థెరపిస్ట్ కనీసం గంట సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా 20 వరకు పడకలు ఉన్నా 8 నుంచి 10 పడకలనే వినియోగించుకోగలుగుతున్నారు.ఆసుపత్రిలో చేరిన పిల్లలకు చైల్డ్ సైకాలజీ, పీజీలు, థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్ వరుసగా చికిత్స చేయిస్తారని పిల్లల వైద్య నిపుణలు డా. ప్రసన్న కుమార్ తెలిపారు. ఒక థెరపిస్ట్ రోజుకు గరిష్ఠంగా 8 మంది వరకు శిక్షణ ఇవ్వగలుగుతున్నారని చెప్పారు. బయటి ఆసుపత్రులతో పోలిస్తే మెరుగైన సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపీ పోస్టులు పెంచితే ఎక్కువ మంది చిన్నారులకు ట్రీట్మెంట్ చేసేందుకు వీలుంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డా. ప్రసన్న కుమార్ వెల్లడించారు.
Read Also : Vishakapatnam: విశాఖ విమ్స్లో మోకాళ్లకు ఉచిత ట్రీట్మెంట్