ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ముంబైపై 3 వికెట్ల తేడాతో జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ (2/34), గెరాల్డ్ కొయెట్జ్ (1/10), అర్షద్ ఖాన్ (1/18), రషీద్ ఖాన్ (1/21), సిరాజ్ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(43), బట్లర్(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్(2/22) ఆకట్టుకున్నారు.గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా తెవాటియా(11 నాటౌట్), అర్షద్ఖాన్(1 నాటౌట్) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.
క్యాచ్ మిస్
గత మ్యాచ్లలో ముంబైకి మెరుపు ఆరంభాలను అందించిన ముంబై ఓపెనర్లు రికెల్టన్ (2), రోహిత్ (7) ఆదిలోనే పెవిలియన్కు చేరడంతో ఆ జట్టుకు మొదట్లోనే షాకులు తాకాయి. సిరాజ్ రెండో బంతికే రికెల్టన్ ఇచ్చిన క్యాచ్ను కవర్స్లో సుదర్శన్ అందుకోగా లెఫ్టార్స్ పేసర్లను ఆడటంలో తంటాలుపడే రోహిత్ మరోసారి అదే బలహీనతను చాటుతూ అర్షద్ నాలుగో ఓవర్లో మిడాఫ్ వద్ద ప్రసిద్ధ్ చేతికి చిక్కాడు. ఎదుర్కున్న రెండో బంతికే సుదర్శన్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన జాక్స్కు సూర్య జతకలవడంతో ముంబై స్కోరువేగం పుంజుకుంది. సిరాజ్ మూడో ఓవర్లో జాక్స్ 6,4 కొట్టగా.. ప్రసిద్ధ్ 5వ ఓవర్లో సూర్య మూడు బౌండరీలు రాబట్టాడు. అర్షద్ ఆరో ఓవర్లో జాక్స్ కూడా మూడు ఫోర్లు బాదాడు. ఈ ద్వయం దూకుడుతో పది ఓవర్లకు ముంబై 89/2తో పటిష్టంగానే నిలిచింది. సాయి కిషోర్ 11వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టిన జాక్స్ అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. కానీ ఇదే ఓవర్లో సూర్య భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్లో షారుక్కు క్యాచ్ ఇవ్వడంతో 71 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సూర్య నిష్క్రమణతో ముంబై ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది.

ప్రభావం
ఓటమి గురించి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, తాము మంచి పోరాటం చేశామని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. విజయం కోసం ఒక జట్టుగా కలిసి పోరాడామని కానీ ఈ పిచ్పై మాకు ఇంకా రన్స్ ఉండేవన్నారు. నా అంచనా ప్రకారం,ముంబై జట్టు 25 పరుగులు తక్కువ చేసిందని హార్దిక్ చెప్పాడు. అయితే ఓటమికి దగ్గరగా రావడానికి బౌలర్లే బాధ్యత వహించాలన్నాడు. ఈ మ్యాచ్లో క్యాచ్ల కంటే నో-బాల్స్ ఎక్కువగా బౌల్ చేశామని తాను అనుకుంటున్నానన్నారు. చివరి ఓవర్లో నో-బాల్ గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదన్నాడు. టీ20 క్రికెట్లో నో-బాల్స్ వేయడం మరణశిక్ష విధించదగిన నేరంగా తాను భావిస్తానన్నాడు. ఎందుకంటే నో-బాల్స్ ద్వారా వచ్చే పరుగులు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయన్నాడు. ముంబై జట్టులోని అందరు ఆటగాళ్లు 120 శాతం ఇవ్వడం చూసి సంతోషంగా ఉందన్నాడు. ఎందుకంటే తక్కువ స్కోరు చేసినప్పటికీ చివరి వరకు పోరాడామని చెప్పాడు. వర్షం వల్ల ఆటను రెండుసార్లు ఆపివేసి తప్పుగా తిరిగి ప్రారంభించారని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు మొత్తం 3 నో-బాల్స్ వేశారు. అందులో హార్దిక్ పాండ్యా 2 నో-బాల్స్ వేయడం గమనార్హం.
Read Also :Kohli: కోహ్లీ పై బాలీవుడ్ సింగర్ సంచలన వ్యాఖ్యలు?