పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం స్పందించారు. భారత్ ప్రతిస్పందన ప్రాంతీయ సంఘర్షణకు దారితీయకుండా ఉండాలన్న వాన్స్ అటు పాకిస్థాన్కు కీలక సూచనలు చేశారు. ఉగ్రవాదుల కోసం వేటలో భారత్కు సహకరించాలని సూచించారు. ‘‘26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను పట్టుకోవడంలో పాకిస్థాన్ సహకరించాలి. భారత్ ప్రతిస్పందన పెద్ద ఎత్తున ప్రాంతీయ సంఘర్షణ తలెత్తకూడదనేది మా ఆశ. పాకిస్తాన్ తమ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్తో కలసి పని చేయాలి’ అని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వాన్స్ పేర్కొన్నారు.
ఆవేదన
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత్లో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఘటనపై వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీకి వాన్ ఫోన్ చేసి తీవ్రంగా ఉగ్రదాడిని ఖండించారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటంలో భారత్కు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఎక్స్లో కూడా పహల్గామ్ దాడిలో చనిపోయినవారి కుటుంబాలకు వాన్స్ సంతాపం తెలిపారు. ‘భారత్లోని పహల్గామ్లో జరిగిన భయానక ఉగ్రదాడిలో మరణించినవారికి ఉషా, నేను సంతాపం తెలుపుతున్నాం. ఈ విషాదం నుంచి బాధిత కుటుంబాల త్వరగా కోలుకోవాలని మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం’ అని వాన్స్ ట్వీట్ చేశారు.

ఉద్రిక్తత
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖ అమెరికా నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కానీ, నేరుగా పాకిస్థాన్పై మాత్రం ఆరోపణలు చేయలేదు. అటు చైనా సైతం పహల్గామ్ ఘటనపై దర్యాప్తునకు మద్దతు ఇస్తుందని ప్రకటించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, పరస్పరం చర్చించుకుని, ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా ముందడుగు వేయాలని కూడా చైనా సూచించింది.పహల్గామ్ ఉగ్రదాడిలో నేపాలీ, కశ్మీర్ పౌరుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగిస్తోంది. దాడి వెనుక పాకిస్థాన్ కుట్రలు ఉన్నట్టు అనుమానిస్తోన్న భారత్ దాయాదిపై కఠిన చర్యలు తీసుకుంటూ దశాబ్దాలుగా కొనసాగుతోన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దుచేసింది. అలాగే, భారత్లో ఉన్న పాక్ పౌరులను వెనక్కు పంపించింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతి పెద్ద ఉగ్రదాడులలో ఇదొకటి.
Read Also: NIA : ఉగ్రవాదులు తెలిపిన సంచలన విషయాలు