పుణ్యభూమిగా ప్రసిద్ధమైన ఉత్తరాఖండ్లోని హిమాలయాల మధ్య వెలసిన కేదార్నాథ్ ఆలయం ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ పుణ్యక్షేత్రం తెరుచుకుంది. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడంతో, దేశం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం వేళ వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయ తలుపులను తెరిచారు. ఈ పవిత్ర దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారికి ఆధ్యాత్మిక తృప్తి దక్కింది.

పూల వర్షంతో ప్రారంభోత్సవం:
ఈ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. తలుపులు తెరచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. దీనికోసం 13 టన్నుల పూలను వినియోగించారు.
ముఖ్యమంత్రి ధామి తొలి పూజలు:
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై, స్వయంగా కేదారేశ్వరునికి తొలి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అఖండ జ్యోతి దర్శనం చేసి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆలయ తలుపులు మూసిన సమయంలో ఆలయంలోని మూర్తికి అలంకరించిన పూజా వస్తువులను తొలగించి, తాజా పూలతో స్వామిని శోభాయమానంగా అలంకరించారు.
చార్ ధామ్ యాత్రకు శ్రీకారం
కేదార్నాథ్ ఆలయం తెరుచుకోవడం ద్వారా ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు శుభారంభం జరిగినట్లు భావిస్తున్నారు. యమునోత్రి, గంగోత్రి ధామాలు ఇప్పటికే ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున తెరవగా, బద్రీనాథ్ ఆలయం మే 4న భక్తుల దర్శనానికి సిద్ధమవుతోంది. ఈ నాలుగు క్షేత్రాలను సందర్శించడం భారతీయ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు. భక్తుల సౌలభ్యం కోసం సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో సాగే ఈ ప్రయాణం భక్తులకు భౌగోళిక కష్టాలను అధిగమించే అవకాశం కల్పిస్తోంది. భద్రతా నిబంధనలను పాటిస్తూ ప్రయాణించాల్సిందిగా యాత్రికులకు అధికారులు సూచిస్తున్నారు.
భద్రతా ఏర్పాట్లు:
ఇటీవలి జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా అప్రమత్తమయ్యాయి. చార్ధామ్ యాత్ర రూట్లో పోలీసు, పారమిలిటరీ బలగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. డ్రోన్ల ద్వారా గగన పర్యవేక్షణ, చెక్ పోస్టులు, సీసీ కెమెరాలతో ప్రయాణదారుల కదలికలపై పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. అనుమానిత వ్యక్తుల తాలూకు సమాచారం వెంటనే స్థానిక పోలీసులకు అందించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే ప్రయాణ సమయంలో తగిన ఐడెంటిటీ ప్రూఫ్, టోకెన్లు తదితరాలను మెయింటైన్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. భక్తులు ఆత్మవిశ్వాసంతో, శాంతంగా యాత్రను కొనసాగించాలని అధికారులు కోరుతున్నారు.