Maoists : వరంగల్లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిని ఐజీ చంద్రశేఖర్రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ఒక్కో మావోయిస్టుకు రూ.25వేల ఆర్థిక సహాయం అందించాం. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే మా ఉద్దేశం. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా సహకారం అందిస్తాం. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.

వారిలో 28 ఏళ్ల లోపు వారే ఎక్కువ
ఈ ఏడాది 250 మంది సరెండర్ అయ్యారు. నేడు 14 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. రెండు నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాం అని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. సరెండర్ అయిన వారిలో 28 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్తో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ భద్రతా దళాలు ఆ ఆపరేషన్ చేపట్టాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పునరావాస పథకాలు
ఈ 14 మంది లొంగిపోయిన వారిలో మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వారు తమ గత జీవితాన్ని వీడి, శాంతియుత జీవితం ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. పోలీసుల ప్రకారం, లొంగిపోయిన వారిపై వివిధ ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. అయితే, వారు స్వచ్ఛందంగా లొంగిపోవడం, ప్రభుత్వ పునరావాస పథకాలను స్వీకరించడం ద్వారా కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.