Government : పసుపు రైతులకు భరోసా – మద్దతు ధర, నష్టపరిహారం, వ్యవసాయ పరికరాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, పసుపు రైతన్నకు భరోసా కల్పించాలంటే మద్దతు ధర తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.రైతుల అభివృద్ధికి గాను రాష్ట్రంలో రూ.2 లక్షల రుణ మాఫీని ఒకే విడతలో అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైతు భరోసా తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ, ఆ నిధులను తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును అమలు చేసినప్పటికీ, ఇతర పథకాలను విస్మరించిందని విమర్శించారు.తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ పునఃప్రారంభించామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయిల్పామ్ సాగు వల్ల నాలుగు ఎకరాల్లో చేసే లాభం కేవలం ఒక ఎకరంతో సాధ్యమవుతుందని తెలిపారు.
రైతుల సంక్షేమానికి కొత్త దిశలో తెలంగాణ ప్రభుత్వం
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తామని, తమ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తెలిపారు. నిజాంసాగర్, ఎస్ఆర్ఎస్పీ నుంచి అదనపు ఆయకట్టు విస్తరణపై కూడా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రైతుల పక్షంలో నిలబడి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం భారీ ఖర్చు చేసినప్పటికీ, వాటి ఫలితాలు ఎంతవరకు రైతులకు చేరాయని ప్రశ్నించారు. బ్యారేజీలు కూలినా వరిసాగు రికార్డు స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇవ్వబడుతోందని తెలిపారు. సన్న వరివరకు క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించినట్టు చెప్పారు.
Read More : Madhira : 2,325 మందికి ఉద్యోగ పత్రాలు