Madhira : మెగా జాబ్ మేళా – 2,325 మందికి ఉద్యోగ పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర నియోజకవర్గంలోని రెడ్డి గార్డెన్స్ కళ్యాణమండపంలో సోమవారం జరిగిన మెగా జాబ్ మేళా యువత నుంచి విశేష స్పందన పొందింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి సంస్థ, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో ఈ మేళా నిర్వహించబడింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 5,287 మంది యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. అర్హత ఆధారంగా 2,325 మందిని ఎంపిక చేసి వారికి నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, నేటి యువత దేశానికి, రాష్ట్రానికి మానవ వనరులుగా మారాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగ నియామకాలలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా నిరుద్యోగుల జీవితాలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ప్రజా ప్రభుత్వం మూడంచల ఉద్యోగ కల్పనపై దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, బహుళజాతి కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను, అలాగే స్వయం ఉపాధి కోసం జాబ్ మేళాలు, రాజీవ్ యువ వికాసం వంటి కార్యక్రమాల ద్వారా ఉపాధిని విస్తరించాలని ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు.

ఉద్యోగ కల్పనలో మూడంచల వ్యూహం – ప్రభుత్వ సంకల్పం స్పష్టం
ఈ మెగా జాబ్ మేళాలో మొత్తం 80 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఫార్మ, సాఫ్ట్వేర్, ట్రేడ్ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగావకాశాలను ఉంచాయి. ఎంపిక కాని కొంతమంది అభ్యర్థులకు త్వరలో మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలిసిన తమకు ఇలాంటి మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించడం అనిర్వచనీయమని తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం మెరుగు పాలెం రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం యువతకు సందేశం ఇస్తూ, మత్తు పదార్థాలు, సంఘ విద్రోహశక్తులకు దూరంగా ఉండాలని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
Read More : Revanth Reddy: మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం