Hyderabad : రూ.10,500Cr AI డేటా క్లస్టర్ ఏర్పాటు
Hyderabad : జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం హైదరాబాద్లో భారీ పెట్టుబడులను సాధించింది. శుక్రవారం టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా మరియు నెయిసా నెట్వర్క్స్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి త్రైపాక్షిక ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.10,500 కోట్ల పెట్టుబడులు హైదరాబాదులోకి రానున్నాయి.ఈ డేటా సెంటర్ క్లస్టర్ 400 మెగావాట్ల సామర్థ్యం కలిగినదిగా ఉండనుంది. 25,000 జిపియులతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను అందించేందుకు ఇది రూపొందించబడుతోంది. తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఏఐ ఫస్ట్ సొల్యూషన్లను అభివృద్ధి చేయడం కోసం ఈ క్లస్టర్ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.ఈ ప్రాజెక్టు 500 మెగావాట్ల వరకు గ్రిడ్ మరియు పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో పనిచేస్తుంది. అత్యాధునిక లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి కూలింగ్ సాంకేతికతలను ఉపయోగించి ఈ డేటా సెంటర్ నిర్మించనున్నారు. ఇది ఎన్విరాన్మెంటల్, సోషల్ మరియు గవర్నెన్స్ (ESG) ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడుతుంది. దీనివల్ల తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభ పెరుగుతుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు ఇది మద్దతుగా నిలుస్తుంది.

జపాన్ కంపెనీలతో హైదరాబాద్కు భారీ AI పెట్టుబడి
ఈ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులతో పాటు నిపుణుల లభ్యత వలన రాష్ట్రం డిజిటల్ సేవల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఎడబ్ల్యూఎస్, ఎస్టీ, టిల్మెన్ హోల్డింగ్స్, సిటిఆర్ఎల్ఎస్ వంటి ప్రముఖ సంస్థలు డేటా సెంటర్ ప్రాజెక్టులు ప్రారంభించిన నేపథ్యంలో ఎన్టీటీ డేటా భారీ పెట్టుబడితో హైదరాబాద్ దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా మరింత బలపడనుంది. టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్టీటీ డేటా 50 దేశాల్లో 1.93 లక్షల మంది ఉద్యోగులతో పనిచేస్తూ, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలుస్తోంది. పబ్లిక్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం రంగాల్లో ఈ సంస్థ విశేష సేవలు అందిస్తుంది. మరోవైపు, నెయిసా నెట్వర్క్ ఒక ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫారమ్ కంపెనీగా నిర్దిష్ట ఏఐ కంప్యూటింగ్ సొల్యూషన్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.