అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి సేవ చేసే లక్ష్యంతో పుట్టుకొచ్చిన తెలుగు సంఘాలు ఇప్పుడు వారి ఉసురు తీశాయి. తెలుగు సంఘాలతో కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో 200 మంది తెలుగు ఉద్యోగుల్ని వారు పనిచేస్తున్న ఓ సంస్థ తొలగించింది. దీంతో ఈ వ్యవహారం అమెరికాలో తీవ్ర కలకలం రేపుతోంది. అసలే ఓవైపు ట్రంప్ ప్రభుత్వ వలస విధానాలు, వీసా ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
నిధుల దుర్వినియోగానికి పాల్పడారు
ఫానీ మే అనే సంస్ధలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్న తెలుగు సంఘం తానాతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక కారణాలపై 200 మంది తెలుగు ఉద్యోగులపై వేటు పడింది. వీరిని ఉద్యోగాల నుంచి తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అమెరికా ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్స్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసి వీరు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తేల్చినట్లు సమాచారం.

700 మంది ఉద్యోగుల్ని తొలగింపు
ఈ ఏడాది ఆరంభంలోనే క్యూపర్టినోకు చెందిన ఉద్యోగుల్ని కూడా సరిగ్గా ఇవే ఆరోపణలతో తొలగించారు. అలాగే యాపిల్ సంస్థ కూడా 100 మంది ఉద్యోగుల్ని ఇలాగే తొలగించింది. ఇప్పుడు మరోసారి ఫానీ మే సంస్ధలో ఇలాంటి స్కాం చోటు చేసుకుంది. దీంతో మొత్తం 700 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200 మంది తెలుగు వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో అమెరికాలో తెలుగు సంఘాల పాత్రపై చర్చ జరుగుతోంది. అమెరికాలో తెలుగు సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలకు కంపెనీల తరఫున మ్యాచింగ్ ఫండ్స్ ఇప్పించే క్రమంలో అక్రమాలపై తెలుగు ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడం చర్చనీయాంశమవుతోంది.
స్కాంలలో చిక్కుకుని ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు
అమెరికాలో ఇప్పటికే ట్రంప్ సర్కార్ వచ్చాక భారీ సంఖ్యలో వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. కొత్తగా జారీ చేసే వీసాలు, గ్రీన్ కార్డులు సహా అన్నింటిపైనా ఆంక్షలు విధించారు. భారతీయ విద్యార్ధులు గతంలో చేసుకునేే పార్ట్ టైమ్ ఉద్యోగాలకు కూడా గండిపడింది. ఇలాంటి తరుణంలో అక్కడ అన్ని అర్హతలతో ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా ఇలాంటి స్కాంలలో చిక్కుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Read Also: Sheikh Hasina: షేక్ హసీనాను విమర్శిస్తే రహస్య జైలులో భయానక శిక్ష