26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు భారత్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో రాణా గురించి గతంలో ప్రధానంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2011లో ఈ కేసుకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేసింది. కానీ, ఆ దాడులకు కారణమైన ఉగ్ర సంస్థకు మద్దుతు ఇచ్చినందుకు రాణాను దోషిగా తేల్చింది.
నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్
అయితే ఆ తీర్పుపై స్పందిస్తూ 2011 జూన్ 10న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్ చేశారు. ముంబయి ఉగ్రదాడిలో తహవ్వుర్ రాణాను నిర్దోషిగా యూఎస్ ప్రకటించడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. ఇది విదేశాంగ విధానానికి భారీ ఎదురుదెబ్బ’ అని మోదీ పోస్ట్ చేశారు.
18 రోజుల కస్టడీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రాణాను భారత్కు అప్పగించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అంతేకాకుండా అమెరికా న్యాయస్థానం కూడా రాణాను అప్పగించేందుకు అంగీకరించింది. ఇక గురువారమే భారత్కు తీసుకొచ్చిన రాణాను కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. 20 రోజులు కస్టడీకి కోరగా, 18 రోజుల కస్టడీకే ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చందర్జిత్సింగ్ అనుమతించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఎన్ఐఏ అధికారులు తమ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.
READ ALSO: Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?