హైదరాబాద్ నగర ప్రజల కోసం రవాణా వ్యవస్థలో ఒక కీలక ముందడుగు వేస్తున్నారు. త్వరలో ‘టి -ఎంఏఏఎస్’ (తెలంగాణ మొబిలిటీ యాస్ ఏ సర్వీస్) అనే స్మార్ట్ కార్డ్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవచ్చు.ప్రయాణికులకు టికెట్ కొనుగోలు సమస్యలను తొలగించి సులభతరం చేయడం కోసం, తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త సదుపాయాన్ని అందిస్తోంది.
డిజిటల్ చెల్లింపులు
హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల కోసం ‘ (ఐ-టిఐఎంఏఏఎస్ ) ను 2,800 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నారు.హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటికే స్మార్ట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త టి -ఎంఏఏఎస్ కార్డుతో మెట్రో, బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ట్యాప్ మెషీన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్డులను రెండు రవాణా వ్యవస్థల్లో ఉపయోగించవచ్చు.
రవాణా వ్యవస్థ
హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు హెచ్ యూఎంటిఏ (హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 25 లక్షల ఆర్టీసీ ప్రయాణికులను, 5 లక్షల మెట్రో రైలు ప్రయాణికులను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం మెట్రో, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని హెచ్ యూఎంటిఏకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తమ గ్రీన్ కార్డులను టిఐఎంఏఏఎస్ కార్డులతో అనుసంధానం చేయడానికి అంగీకరించిందని వెల్లడించారు.

బ్యాలెన్స్ టాప్
బస్సుల్లో ట్యాప్ మెషీన్లను ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ కూడా అంగీకరించిందన్నారు. ఈ కార్డులు మెట్రో కార్డుల మాదిరిగానే పనిచేస్తాయని చెప్పారు. యూపీఐ ద్వారా బ్యాలెన్స్ టాప్ అప్ చేసుకోవచ్చునని అన్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్లు, ఆర్టీసీ కౌంటర్లలో ఈ కార్డులు లభిస్తాయని తెలిపారు. క్యూలైనల్లో వేచి ఉండాల్సిన పని లేకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చునని అన్నారు.
కామన్ కార్డు
ఈ కామన్ కార్డులను అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసుల్లో ఒకే కార్డు ద్వారా ప్రయాణాలు సాగించేలా కామన్ కార్డును తీసుకురావాలని భావించారు. ప్రస్తుతానికి రైల్వే అధికారులు ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేరని తెలిసింది. కరోనా తరువాత ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది. చాలామంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మహిళలు ఉచిత బస్సు సర్వీసులను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి బస్సులు, మెట్రోల్లో కార్డులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.