సిరియాలో అంతర్యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 48 గంటల్లోనే 745 మంది ప్రతీకార హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అలావైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం అసద్ మద్దతుదారులపై ప్రభుత్వ అనుకూల సాయుధ గ్రూపులు దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల అనంతరం అసద్ మద్దతుదారులను వెతికి మరీ చంపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బనియాస్ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ప్రత్యక్ష సాక్షుల వర్ణన
రోహిబ్ కమెల్ అనే వ్యక్తి తన కుటుంబంతో బాత్రూమ్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నాడు.
“వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. మగవారిని ఇళ్ల పైకప్పులపైకి తీసుకెళ్లి కాల్చేస్తున్నారు” అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీర్ హైదర్ అనే బాధితుడు తన ఇంటిలోకి సాయుధులు చొచ్చుకొచ్చి తన ఇద్దరు సోదరులు, అల్లుడిని హత్య చేసినట్లు వెల్లడించాడు.
లటాకియాలో పరిస్థితి అత్యంత ఘోరం
రేవు నగరమైన లటాకియాలో హింస తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం అధిపతి యాసిర్ సబౌహ్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. అలావైట్ల జనాభా అధికంగా ఉన్న లటాకియాలో అల్లర్లు ముదిరాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం
మార్చి 6 నుంచి ఇప్పటి వరకు 973 మంది మరణించారు. గత 48 గంటల్లో 745 మంది హత్యకు గురయ్యారు.
తాత్కాలిక అధ్యక్షుడి ప్రకటన
సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అలార్రా వీడియో సందేశం విడుదల చేశారు. తాజా హింసపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. విదేశీ శక్తుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అలావైట్లు సిరియాలో మైనారిటీ మత సముదాయంగా ఉన్నారు. దేశ జనాభాలో 12% మంది అలావైట్లే. వారు ప్రధానంగా షియా ముస్లింల మూలాల నుండి వచ్చారని భావించబడతారు. అసద్ కుటుంబం గత 50 ఏళ్లుగా సిరియాపై పాలన సాగించింది. అలావైట్లు సైన్యంలో, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కొనసాగారు.