ఇటీవలి కాలంలో భారతదేశంలోని అనేక కంపెనీలు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగాల్లోని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉండటంతో డిమాండ్ కి అనుగుణంగా తమ వ్యాపారాలను రీషేప్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాపారంలోకి అడుగు..
ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇన్ఫర్మాటిక్స్ బుధవారం నాడు రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ కంపెనీ గతంలో కీప్యాడ్ మెుబైల్ ఫోన్లను తయారు చేసి విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బేసిక్ మెుబైల్ ఫోన్లకు డిమాండ్ భారీగా పడిపోవటంతో కొత్త వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త వ్యాపార విభాగం ‘స్టార్టప్ ఎనర్జీ’ పేరుతో సోలార్ ప్యానల్స్ను తయారు చేయడంపై దృష్టి సారిస్తుందని కంపెనీ పేర్కొంది.

సోలార్ ప్యానల్స్ను తయారు
స్టార్టప్ ఎనర్జీ ప్రధానంగా రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం సోలార్ ప్యానల్స్ను తయారు చేయనుంది. మైక్రోమాక్స్ ఇన్ఫర్మాటిక్స్ నిర్వహణ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. తమ లక్ష్యం గ్రీన్ ఎనర్జీని మరింత అందుబాటులోకి తీసుకురావడం, దానిని నమ్మకంగా, తక్కువ ఖర్చుతో అందించడమేన్నారు. దీని ద్వారా వ్యక్తులు, వ్యాపారాలు సుస్థిర ఎనర్జీ పరిష్కారాలను ఉపయోగించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఆధునిక సోలార్ ప్యానెల్ తయారీకి పెట్టుబడి పెడుతూ భారత ఎనర్జీ విధానం లక్ష్యాన్ని సమర్థించడంతో పాటు గ్రీన్ ఎనర్జీ పరిష్కారాలను అందించటంలో తాము భాగంగా మారుతున్నట్లు పేర్కొన్నారు.
వ్యూహాత్మక ఒప్పందం
దీనికోసం గురుగ్రామ్లో ఉన్న మైక్రోమ్యాక్స్ జిన్చెన్తో ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5GW అధునిక సోలార్ మాడ్యూల్ తయారీ లైన్ను తీసుకురానుంది. ఈ ప్రాజెక్ట్ను అనేక దశలలో అమలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దేశంలో సోలార్ ఎనర్జీ రంగం గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలు 2030 నాటికి 500 GW రిన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో స్థానికంగా తయారయ్యే సోలార్ మాడ్యూల్స్ కోసం డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దీనిని అందిపుచ్చుకోవటానికి అంబానీ నుంచి అదానీ వరకు పెద్ద వ్యాపార దిగ్గజాలు కూడా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.